మంచిర్యాల, జూన్ 24 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి, సంక్షేమ ప్రదాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కొనియాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు కేసీఆర్ను, రాష్ట్ర సర్కారును తిట్టడమే పనిగా పెట్టుకొన్నారని మండిపడ్డారు. తెలంగాణను అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలోనే ముందుంచాలనుకోవడం కేసీఆర్ చేసిన తప్పా? అని మంత్రి ప్రశ్నించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లో విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ భారతీ హోళీకేరితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో మూడో విడతలో భాగంగా 408 మంది సింగరేణి కార్మిక కుటుంబాలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. స్వతంత్ర భారతావనిలో ఎవరూ చేయలేని అభివృద్ధి, సంక్షేమ పనులు సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నదని స్పష్టం చేశారు. సింగరేణి గడ్డను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, సింగరేణిలో ఇండ్ల స్థలాలకు పట్టాలు పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సింగరేణిని ప్రైవేట్పరం కానివ్వబోమని భరోసా ఇచ్చారు. సింగరేణి ప్రాంతంలో పట్టాల పంపిణీతో దశాబ్దాల కల నెరవేరిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కుల, మతాల పేరిట ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారని మండిపడ్డారు. వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు.
తెలంగాణకు కేసీఆర్ ప్రభుత్వమే శ్రీరామ రక్ష అని విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాటలకు ఆగం కావొద్దని, కేసీఆర్ సర్కారు చేస్తున్న అభివృద్ధి గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అదృష్టంగా భావిస్తున్నామని, రామకృష్ణాపూర్ పట్టణ అస్థిత్వం, పునర్జీవం తన లక్ష్యమని విప్ సుమన్ పేర్కొన్నారు. 2014 సింగరేణి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నామని తెలిపారు. జీవో 76 తీసుకొచ్చి 2019 జూన్లోనే ఇండ్ల పట్టాలకు అంకురార్పణ చేశామన్నారు. కుల పిచ్చి, మత పిచ్చి నాయకులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కాంగ్రెస్, బీజేపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.