Amit Shah to Nitish | నాలుగేండ్ల క్రితం బీహార్లో కూటమిగా సర్కార్ ఏర్పాటు చేసిన జేడీయూ నేత-సీఎం నితీశ్కుమార్, బీజేపీ మధ్య అలయెన్స్ ముప్పు అంచున చిక్కుకున్నట్లు తెలుస్తున్నది. నాలుగేండ్ల తర్వాత జేడీయూ, బీజేపీ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తడం ఇదే తొలిసారి. పరిస్థితి తీవ్రతను అంచనా వేసిన కేంద్ర హోంమంత్రి అమిత్షా సోమవారం బీహార్ సీఎం నితీశ్కుమార్తో ఫోన్లో మాట్లాడారని సమాచారం. అంతకుముందు అమిత్షాతో బీహార్ డిప్యూటీ సీఎం తారాకిశోర్ ప్రసాద్ సమావేశమయ్యారు. ఢిల్లీకి వెళ్లకముందు నితీశ్తోనూ తారాకిశోర్ ప్రసాద్ భేటీ అయ్యారు. ఇందులో చెప్పుకోదగ్గ పరిణామాలేమీ లేవని సీఎం నితీశ్ కుమార్ అన్నట్లు తెలుస్తున్నది. మంగళవారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీలో నితీశ్ కుమార్ నిర్ణయం తీసుకునే వరకు ఏమీ మాట్లాడవద్దని రాష్ట్ర నేతలను బీజేపీ అధిష్ఠానం కోరినట్లు సమాచారం.
నితీశ్కుమార్కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా భావిస్తున్న బీహార్ మంత్రి విజయ్ చౌదరి మాట్లాడుతూ మంగళవారం తమ పార్టీ నేతలందరితో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తమ పార్టీలో చీలికకు బీజేపీ కుట్ర చేస్తున్నదని జేడీయూ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ బీజేపీ మినహా మిగతా పార్టీలన్నీ కనుమరుగవుతాయని పేర్కొన్నారు.
ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలకు వెళ్లడానికి బీహార్ సీఎం నితీశ్కుమార్ సిద్ధంగా లేరని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త పొత్తు పెట్టుకునే అవకాశాలను పరిశీలిస్తారంటున్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వస్తే నితీశ్కుమార్కు మద్దతు ఇవ్వడానికి సిద్ధం అని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చెప్పారు. బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా ఉంది. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్తో కలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు లభిస్తుంది.
బీహార్ను రిమోట్ కంట్రోల్గా చేసేందుకు హోంమంత్రి అమిత్షా ప్రయత్నిస్తున్నారని సీఎం నితీశ్ కుమార్ ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. ఆదివారం నీతి ఆయోగ్ సమావేశం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం తదితర కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం ద్వారా ప్రధాని మోదీకి నితీశ్ నిరసన తెలిపారని అంటున్నారు. అనారోగ్య కారణాల వల్ల నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు ప్రకటించినా.. పాట్నాలో జరిగిన రెండు ప్రభుత్వ కార్యక్రమాలకు నితీశ్ కుమార్ హాజరు కావడం గమనార్హం.