ఉత్కంఠ పోరులో కోల్కతా నైట్ రైడర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసక్తి రేపిన మ్యాచ్లో చివరి బంతికి కోల్కతా విసిరిన లక్ష్యాన్ని చెన్నై ఛేదించింది. ఒకే ఓవర్లో జడేజా రెండు సిక్సులు, రెండు ఫోర్లు కొట్టి.. మ్యాచ్ను మలుపు తిప్పాడు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. గైక్వాడ్(40), డూప్లెసిస్(43)తో రాణించారు. మెయిన్ అలీ (32) తనవంతు పాత్ర పోషించాడు. రైనా, ధోనీ, రాయుడు నిరాశ పరిచారు. అయితే, చివర్లో జడేజా తన ప్రతాపాన్ని చూపించాడు. ప్రసీద్ కృష్ణ విసిరిన 19వ ఓవర్లో చివరి నాలుగు బంతులను బౌండరీ దాటించాడు. రెండు సిక్సులు, రెండు ఫోర్లతో ఆ ఓవర్లో చెన్నై బ్యాటర్లు 22 పరుగులు పిండుకున్నారు.
అంతకుముందు కోల్కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసి, చెన్నై ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇన్నింగ్స్ చివరలో దినేశ్ కార్తీక్ తన బ్యాట్తో మెరిశాడు. 11 బంతుల్లో 26 (3 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠి 45 (33 బంతుల్లో 4×4, 1×6), నితీశ్ రాణా 37 (27 బంతుల్లో 3×4, 1×6) ఫర్వాలేదనిపించారు.