బెంగళూరు: 2022 ఐపీఎల్ వేలంలో భారత యువ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ రికార్డు ధర పలికాడు. వేలం తొలిరోజే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రూ.15.25 కోట్లు వెచ్చించి ఇషాన్ కిషన్ను కొనుగోలు చేసింది. దాంతో ఐపీఎల్ వేలంలో ఇప్పటివరకు అత్యధిక ధర పలికిన రెండో భారత ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టించాడు. గతంలో భారత ఆటగాళ్లలో యువరాజ్ సింగ్ ఒక్కడే ఇషాన్ కిషన్ కంటే అధిక ధర పలికాడు.
ఇషాన్ కిషన్ బేస్ ప్రైజ్ కేవలం రూ.2 కోట్లు మాత్రమే. కానీ వేలంలో మాత్రం అతను తన బేస్ ప్రైజ్ కంటే ఏడు రెట్లు అధిక మొత్తానికి అమ్ముడుపోయాడు. ఇషాన్ కిషన్పై వేలం జరుగుతున్నంత సేపు ఎక్కడా ముంబై ఇండియన్స్ జట్టు వెనక్కి తగ్గలేదు. చివరికి రూ.15 వేల కోట్లకు పైగా వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది.
ప్రస్తుతం ఇషాన్ కిషన్ స్ట్రైక్ రేటు అన్ని ఫార్మాట్లలోనూ 130కి పైగా ఉన్నది. పైగా ఆఫ్ స్పిన్ సహా అన్ని రకాల బౌలింగ్ను అతను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. అయితే, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ఇషాన్ కిషన్ను రిటైన్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది.
కానీ, ప్రతి బంతిని తెలివిగా బాదే సత్తా కలిగిన ఇషాన్ కిషన్ను ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వదులుకోదల్చుకోలేదు. అందుకే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారించే ఇషాన్ కిషన్ను భారీ ధరకు కొనుగోలు చేసింది.