IPL Mega Auction | త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్-2022 కోసం ఆటగాళ్ల వేలం ముగింపు దశకు చేరుకున్నది. శని, ఆదివారాల్లో బెంగళూరులో ఉత్కంఠభరితంగా సాగిన వేలం ప్రక్రియలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను ఈసారీ ముంబై ఇండియన్స్ వరించింది. రూ.20 లక్షల బేస్ ధరతో ప్రారంభమైన అర్జున్ను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలకు గెలుచుకున్నది. గత వేలంలో అర్జున్ రూ.20 లక్షలకే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైసీ జట్టులో చేరాడు. ఇక కోల్కతా నైట్ రైడర్స్.. టిమ్ సౌథీని రూ.1.5 కోట్లకు కొనుగోలు చేయగా, సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.2.4 కోట్లకు సీన్ అబాట్ను సొంతం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ రూ.2.40 కోట్లకు అల్జారీ జోసెఫ్ను కొనుగోలు చేసింది.
పది ఫ్రాంచైసీల్లో ఒక్కొక్కటి తన జట్టులో 18 మంది క్రికెటర్లు కలిగి ఉండాలి. గరిష్ఠంగా 25 మందికి జట్టులో చోటు ఉంటుంది. కొన్ని ఫ్రాంచైసీలు ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకోగా, మరికొన్ని కనీస స్థాయికి చేరుకున్నాయి. తొలి రోజు వేలంలో అమ్ముడు పోని ప్లేయర్లు ఆదివారం కూడా వేలంలోకి వచ్చారు. వృద్ధిమాన్ సాహాను రూ.1.90 కోట్లు, మ్యాథ్యూ వేడ్ను రూ.2.40 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. సురేశ్ రైనా మరోమారు వేలానికి మొగ్గు చూపలేదు.