‘కార్తికేయ’, ‘ప్రేమమ్’ చిత్రాలతో దర్శకుడిగా తన ప్రత్యేక శైలిని చూపించారు చందూ మొండేటి. నిఖిల్ హీరోగా ఆయన రూపొందించిన సినిమా ‘కార్తికేయ 2’. అనుపమా పరమేశ్వన్ నాయికగా నటించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 13న సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు చందూ మొండేటి.
‘కార్తికేయ 2’ కథ ఆలోచన ఎలా మొదలైంది?
చిన్నప్పటి నుంచి రామాయణ, మహాభారత కథలను ఇష్టంగా చదివేవాడిని. ఇతిహాసాల్లో చెప్పిన ప్రతి విషయానికి ఒక శాస్త్రీయత ఉందని తెలుసుకున్నా. కృష్ణతత్వం అనే అంశాన్ని నేపథ్యంగా ఎంచుకుని ఈ చిత్ర కథను సిద్ధం చేసుకున్నా. ఈ సినిమా ద్వారా ఇప్పటి తరానికి కృష్ణుడి గొప్పదనం చెప్పబోతున్నాం. భక్తితో పాటు థ్రిల్ కలిగించే ఒక సాహసయాత్ర ఈ సినిమా అనుకోవచ్చు.
దీన్ని ‘కార్తికేయ’కు సీక్వెల్గానే చూడాలా?
సీక్వెల్గానే తెరకెక్కించాం అయితే మున్నాభాయ్ సినిమాల్లా కథలు వేరు. మొదటి సినిమా చూడని వాళ్లకు ఇది కొత్త చిత్రాన్ని చూస్తున్నట్లే ఉంటుంది. ఈ కథలో స్వాతి పాత్రకు అవకాశం లేదు. ఒక మిస్టరీ మీద హైదరాబాద్ నుంచి కొందరు స్నేహితులు ద్వారకకు వెళ్తారు. అక్కడేం జరిగింది అనేది తెరపై చూడాలి.
నిఖిల్ నటన గురించి
మొదటి చిత్రంలో వైద్య విద్యార్థి కార్తికేయగా నిఖిల్ కనిపిస్తే..ఇందులో వైద్యుడిగా ఆయన పాత్ర ఉంటుంది. ఫస్ట్ ఫిల్మ్ చేయడంతో సీక్వెల్లో ఎలా నటించాలి అనేది నిఖిల్కు సులువుగా అర్థమైంది. నన్నూ, టీమ్ను నమ్మి ఆయన చాలా కష్టపడ్డాడు.
ఈ సినిమా చిత్రీకరణలో ఎదురైన సవాళ్లేంటి?
పాండమిక్ను ఎదుర్కొని ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేశాం. అదే మాకు పెద్ద చాలెంజ్ అయ్యింది. ప్రతికూల పరిస్థితుల్లో కథనే నమ్మి చిత్రీకరణ జరిపాం.
థ్రిల్లర్ జానర్లోనే మీ సినిమాలు ఉంటాయా?
నాకు జంధ్యాల, శ్రీను వైట్ల సినిమాల్లా పూర్తి వినోదాత్మక చిత్రాన్ని రూపొందించాలని ఉంది. ఆ సినిమాలను మనం థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తాం.
నెక్ట్ చేయబోయే సినిమాలు
గీతా ఆర్ట్స్ సంస్థలో నా తదుపరి సినిమా ఉంటుంది. రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే నాగార్జున గారితో ఓ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సినిమాకు మరో పార్ట్ ఉంటుందా?
ఈ చిత్రానికి రాసుకున్న కథ చాలా విస్తృతమైంది. అయితే సినిమాకు కావాల్సినంత మాత్రమే తీసుకుని మిగతాది పక్కన పెట్టేశాం. ఈ చిత్ర విజయాన్ని బట్టి మరో సీక్వెల్కు ప్లాన్ చేస్తాం. ఇప్పుడైతే ఈ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్ల్లడం మీదే దృష్టి పెట్టాం.