రెంజల్: మహారాష్ట్ర – తెలంగాణ సరిహద్దులో గల వారధి గుండా వాహనాల రాకపోకలను మహారాష్ట్ర పోలీసులు ఆదివారం నుంచి నిలిపివేశారు. రెంజల్ మండలం కందకుర్తి గ్రామ సమీపంలోగల గోదావరినదిపై నిర్మించిన వంతెనపై నుంచి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రికార్డు స్థాయిలో వరద నీరు పొంగి ప్రవహించింది.
మూడు రోజుల పాటు ఏకతాటిగా వరద ఉధృతి ప్రవాహం కొనసాగడంతో అంతరాష్ట్ర వంతెన బీటలు వారినట్లు సమాచారం. ఈ బ్రిడ్జి మహారాష్ట్రకు చివరలో ఉండటంతో అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వంతెనపై నుంచి రాకపోకలు సాగిస్తే ప్రమాదం పొంచిఉందని శనివారం వరద ఉధృతిని పరిశీలించేందుకు వచ్చిన ఉన్నత అధికారుల పరిశీలనలో వెల్లడైంది. రాక పోకలు యాథావిధిగా కొనసాగితే వంతెనకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అంచనావేశారు.
భారీ వాహనాల రాకపోకలను బంద్ చేయాలని ఉన్నతాధికారులు ఆర్అండ్బీకి నోటీసులు జారీ చేసినట్లు ధర్మాబాద్ పోలీసులు తెలిపారు. దీంతో ధర్మాబాద్ – కందకుర్తి ప్రధాన రోడ్డు మార్గం గుండా వాహనాల రాకపోకలను నిలిపివేస్తూ రోడ్డుకు అడ్డంగా బారీ కేడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ వైపు నుంచి ఎలాంటి వాహనాలు రాకుండా ముందస్తు సమాచారం అందించారని ధర్మాబాద్ పోలీసులు పేర్కొన్నారు.