International Flights from 15th | కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నది. విదేశాల్లో విద్యాభ్యాసం, ఉద్యోగాలు చేస్తున్న వారికి, భారత్లో ఉన్న విదేశీయులకు శుభవార్త అందిచింది. దాదాపు 20 నెలల తర్వాత అంటే, వచ్చేనెల 15 నుంచి విదేశీ విమాన సర్వీసులను పునరుద్ధరించడానికి అనుమతి ఇచ్చింది. దీంతో వివిధ దేశాల్లో జీవిస్తున్న ఇండియన్స్కు, వారి కుటుంబాలకు 10 రోజుల ముందే క్రిస్మస్ వచ్చినట్లవుతుంది. అయితే కోవిడ్-19 నియంత్రణలో ఉన్న దేశాలకు మాత్రమే విమాన సర్వీసులను పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించింది.
ఇంతకుముందు ఈ ఏడాది చివరికల్లా అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరిస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 14 దేశాల్లో తిరిగి కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. యూరోపియన్ యూనియన్లోని కొన్ని దేశాల్లో న్యూ కోవిడ్ వేరియంట్ తలెత్తింది. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి గతేడాది మార్చి నుంచి కేంద్రం అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది.
ప్రస్తుతం వివిధ దేశాలతో అమలులో ఉన్న ఎయిర్బబుల్ ఒప్పందాల ప్రకారం దాదాపు 31 దేశాలకు వందేభారత్ స్కీం కింద గతేడాది నుంచి విమాన సర్వీసులు నడుపుతున్నది. అయితే, ప్రత్యేక పరిస్థితుల్లో పరిమిత ప్రయాణికులతో వివిధ ఎయిర్లైన్స్ నడుపుతున్న సర్వీసుల్లో కోవిడ్-19 ముందు ధరలకు మించి ప్రయాణ చార్జీ వసూలు చేస్తున్నారు. ఇక రద్దీ టైంలో ఆయా ప్రయాణ టిక్కెట్ల ధరలు బాగా పెరుగుతాయని చెబుతున్నారు. కనుక క్రిస్మస్ వేళ విమాన టికెట్లు బుక్ చేసుకుంటే అధికంగా ధర చెల్లించాల్సి వస్తుంది.