హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 3: పిట్ట కొంచెం.. కూత ఘనం అన్న చందంగా.. హైదరాబాద్కు చెందిన ఓ పిల్లగాడు అతి చిన్న వయస్సులోనే అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇంటర్నెట్ ఓ సమాచార భాండాగారం అన్న సంగతి తెలిసిందే. కొందరు దానిని దుర్వినియోగం చేస్తుంటే.. ఎంతోమంది దానిని ఎదుగుదలకు వారధిగా సద్వినియోగం చేసుకొంటున్నారు. హైదరాబాద్కు చెందిన బాలుడు ఆరవ్ గార్గ్ కూడా ఆ కోవకే చెందుతాడు. ఇంటర్నెట్ ద్వారా స్వయం శిక్షణ పొందిన ఆరవ్ నేడు ఒక ఆవిష్కర్తగా, ప్రోగ్రామర్గా, పారిశ్రామికునిగా, రచయితగా, సాంకేతిక నిపుణుడిగా, రోబోటిక్ ఎక్స్పర్ట్గా రికార్డు సృష్టిస్తున్నాడు. ఈ వండర్ బాయ్ పదేండ్ల వయస్సులోనే తొలి రోబో -‘ది లైన్ ఫాలోవర్’ను రూపొందించాడు. ఆ తరువాత ఆరేండ్ల వ్యవధిలో ఐదు రోబోలను రూపొందించిన ఆరవ్, ఇప్పుడు ఓ యూట్యూబ్ చానెల్ను నడపడమే కాకుండా ఒక డిజిటల్ పత్రికను, టెక్నాలజీ యాప్ను ప్రారంభించాడు. ‘నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు మాకు లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ గురించి నేర్పించారు. అప్పుడు కేవలం బేసిక్స్ మాత్రమే చెప్పారు. నేను ఇంటికి వెళ్లి ఇంటర్నెట్లో వేర్వేరు ప్రోగ్రామింగ్ల గురించి వెతికాను. సొంతంగా జావా, హెచ్టీఎంఎల్, పైతాన్ వంటివి నేర్చుకున్నా. ఆ తరువాత రోబోటిక్స్పై ఆసక్తి పెరిగింది. నెల రోజుల్లోనే నా తొలి రోబోను తయారచేశా. ఇదంతా యూట్యూబ్ వీడియోల ద్వారా సాధ్యమైంది’ అని చెప్పాడు. సిస్టర్ నివేదిత స్కూల్లో పదోతరగతి వరకు చదువుకున్న ఆరవ్ ఇప్పుడు ఫిట్జీలో 12వ తరగతిలో ఉన్నాడు. ఈ బాలుడు ఇటీవల జేబులో పెట్టుకోగలిగే వాతావరణ కేంద్రాన్ని తయారుచేశాడు. అది వాతావరణ అంచనాలను కచ్చితంగా తెలుపడం విశేషం. సాంకేతిక పరిజ్ఞానంపై ఈ బాలుడికి ఉన్న ఆసక్తి ఇటీవల రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను కలిసేలా చేసింది. 2021లో జరిగిన టెడ్ ఎక్స్ చర్చల్లోనూ పాల్గొని నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచాడు. ఆరవ్ తనకున్న సాంకేతిక జ్ఞానాన్ని ఎక్కువమందికి పంచాలనుకున్నాడు. దీంతో 2021లో యువతకు ముఖ్యంగా హైస్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించే లక్ష్యంగా ‘టెక్నట్టీజ్’ అనే స్టార్టప్ను రూపొందించాడు. ఆరవ్ తల్లి పల్లవీ గర్గ్ రచయిత కాగా, తండ్రి పంకజ్కుమార్ గర్గ్ ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తనకిష్టమైనవన్నీ చేయగలుగుతున్నానని ఆరవ్ చెప్పాడు.