న్యూఢిల్లీ: జెనీవాలో ఉన్న ఇంటర్ పార్లమెంటరీ యూనియన్(ఐపీయూ) అధ్యక్షుడు డార్టీ పాచికో ఇవాళ రాజ్యసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. సభ జరుగుతున్న సమయంలో ఆయన గ్యాలరీ నుంచి కార్యక్రమాలను పరిశీలించారు. ఏడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇండియాకు వచ్చారు. మంగళవారం రోజున పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగే కార్యక్రమంలో డార్టీ పాచికో.. భారతీయ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. పోర్చుగల్ పార్లమెంట్ సభ్యుడైన పాచికో.. ఇటీవల ఐపీయూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భారత పార్లమెంట్ పంపిన ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడకు వచ్చారు. ఐపీయూను 1889లో స్థాపించారు. దీంట్లో 179 సభ్యదేశాలు ఉన్నాయి.
పార్లమెంట్ ఆవరణలో ఐపీయూ అధ్యక్షుడు డార్టీ పాచికో మీడియాతో మాట్లాడారు. అతి ప్రాచీన, అత్యంత పెద్ద దేశాల పార్లమెంట్ వ్యవస్థలతో ఇంటెరాక్ట్ కావడం ఐపీయూ ఉద్దేశమని, అందుకే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఏదైనా మార్గం కనిపిస్తే.. భారత్, ఐపీయూ మధ్య సహకారాన్ని మరింత పెంపొందించనున్నట్లు ఆయన తెలిపారు.