హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ 2021-22 విద్యా సంవత్సరాన్ని సోమవారం బోర్డు ఖరారు చేసింది. ఈ సారి పరీక్షల విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. అర్ధ సంవత్సరం, ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆన్లైన్ తరగతులతో కలిపి విద్యా సంవత్సరంలో 220 పని దినాలుంటాయని తెలిపింది. దసరాకు పండుగకు ఆదివారంతో కలిపి అక్టోబర్ 13వ తేదీ నుంచి 16 వరకు సెలవులు ఇచ్చింది. 17న ఆదివారం కాగా.. 18న తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. డిసెంబర్ 13 నుంచి 18వ తేదీ వరకు అర్ధ సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగకు 13వ తేదీ నుంచి 15 వరకు మూడు రోజులు సెలవులు ప్రకటించింది. మళ్లీ 17న తరగతులు ప్రారంభమవుతాయని, ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతాయని, 23వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 15 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. మే చివరి వారంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని చెప్పింది. ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని, జూన్ 1న కాలేజీలు పునః ప్రారంభమవుతాయని వివరించింది. ఈ మేరకు సోమవారం అకాడమిక్ క్యాలెండర్ను ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ విడుదల చేశారు.