హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ సోమవారం విడుదలైంది. ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు పరీక్షలు జరుగనున్నాయి. 20న ఫస్టియర్కు, 21న సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ప్రధాన పరీక్షలు మే ఐదో తేదీతో ముగియనుండగా, మైనర్ సబ్జెక్టులకు మే 10 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ సోమవారం పరీక్షల టైం టేబుల్ను విడుదల చేశారు. పరీక్షలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మూడుగంటలపాటు నిర్వహిస్తారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఆదివారాల్లో సైతం ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తామని జలీల్ ప్రకటించారు. ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ పరీక్షలను ఏప్రిల్ 11, 12 తేదీల్లో నిర్వహిస్తామని చెప్పారు. గతంలో విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు ప్రాక్టికల్స్, మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు వార్షిక పరీక్షలు జరుగాల్సి ఉన్నది. కానీ, కరోనా మూడోవేవ్ కారణంగా షెడ్యూల్లో మార్పులు చేశారు.
అదనపు పీరియడ్లు పెట్టండి..
పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో సిలబస్ పూర్తిచేయడంపై ఇంటర్బోర్డు అధికారులు దృష్టి పెట్టారు. ఇంటర్బోర్డు అధికారులు సోమవారం ప్రిన్సిపాళ్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిలబస్ను పూర్తిచేసేందుకు రోజు అదనపు పీరియడ్లు నిర్వహించాలని ఆదేశించారు. ఈ ఏడాది థియరీ, ప్రాక్టికల్స్కు 70 శాతం సిలబస్సే అమలువుతుందని చెప్పారు.
మే 6 ఎస్సెస్సీ పరీక్షలు!
ఇంటర్ పరీక్షల టైం టేబుల్ కావడంతో ఇక ఎస్సెస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదలకావాల్సి ఉన్నది. ఇంటర్ పరీక్షలు ముగిసిన మరుసటి రోజు నుంచే ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు మొదలుకావడం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం ఇదే సంప్రదాయం కొనసాగుతున్నది. ఈ లెక్కన ప్రధాన పరీక్షలు మే 5వ తేదీతో ముగియనుండగా.. మే 6 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.