బోధన్ రూరల్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని కోరుతూ గ్రామ పంచాయతీకి చెందిన వార్డు సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం మండంలోని సాలూర గ్రామం వద్ద బోధన్ నుంచి నాందేడ్ వైపు వెళ్లే రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పంచాయతీకి చెందిన రెండు లక్షల 22 వేల రూపాయలను ట్రాన్స్ఫార్మర్ తరలించడానికి నిధులు దుర్వినియోగం చేసిన సర్పంచ్ చంద్రకళ కుటుంబ సభ్యులు, ఉప సర్పంచ్ డిస్కోసాయిలు, పంచాయతీ కార్యదర్శి రాజీవ్ గాంధీలపై విచారణ చేపట్టి తక్షణమే సస్పెండ్ చేయాలని కోరారు. సర్పంచ్ తన సొంత స్థలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను మరో చోటికి తరలించడానికి పంచాయతీ నిధులను అక్రమంగా వాడుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
తీర్మానం కాపీపై ట్రాన్స్ఫార్మర్ తరలించే విషయం లేకున్నా వార్డు సభ్యులు సంతకాలు పెట్టిన అనంతరం ఖాళీ స్థలంలో తీర్మానం జరిగినట్లు రాసుకుని నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.రాస్తారోకో విషయం తెలుసుకున్న బోధన్ రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు మోనేగారి రాజు, గంగాధర్, శ్రీరామ్, గంగాధర్, పోశెట్టి, శివకాంత్పటేల్, మట్టెన్ ప్రకాశ్, భాస్కర్, లక్ష్మణ్ తదితరులున్నారు.