సంగారెడ్డి, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతున్నది. సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన నూతన పరికరాలు పరిశ్రమ, హెల్త్కేర్ రంగానికి ఎంతో ఉపయోగపడనున్నాయి. మానవాళికి ఉపయోగపడే అనేక ఆవిష్కరణలు ఇటీవలి కాలంలో ఐఐటీహెచ్ నుంచి వెలుగుచూశాయి. గురువారం ‘ఇన్వెంటివ్’ పేరుతో ఐఐటీ హైదరాబాద్ ఎగ్జిబిషన్ నిర్వహించింది. ఇందులో ప్రదర్శించిన నూతన ఆవిష్కరణలు ఐఐటీ విద్యార్థులు, సందర్శకులను ఆలోచింపజేశాయి. 14, 15 తేదీల్లో ఢిల్లీ ఐఐటీలో నిర్వహించే ఎగ్జిబిషన్కు ఐఐటీ హైదరాబాద్లో గురువారం ప్రదర్శించినవాటిలో ఆరు ఆవిష్కరణలను పంపనున్నారు.
ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్
ఐఐటీహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్ దేవరాజ్ భట్టాచార్య బృందం ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను అభివృద్ధి చేసింది. రూ.9 కోట్లతో ఏర్పాటుచేసేలా ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ ప్లాంట్ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ, మురుగునీటిని శుభ్రం చేసి మంచినీటిగా మారుస్తుంది. ఈ నీటిని పరిశ్రమలు తిరిగి తమ అవసరాలకు వినియోగించుకోవచ్చు. దేవరకొండలోని ఇథనాల్ పరిశ్రమలో ప్రస్తుతం ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటుచేశారు.
స్వీయ క్రిమినాశక స్ప్రే
ఐఐటీహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్ దేవేంద్ర భట్టాచార్యకు చెందిన డురోకియా స్టార్టప్ కంపెనీ స్వీయ క్రిమినాశక నానో టెక్నాలజీ స్ప్రే పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఈ స్ప్రేను దవాఖానల్లోని నేల, వైద్య పరికరాలు, యంత్రాలు, రోగుల చేతులకు స్ప్రే చేయడంతో ఇన్ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు నశించడంతో పాటు వ్యాప్తిని నిరోధిస్తాయి.
5జీలో ఎన్బీ-ఐవోటీ మాడ్యూల్ అభివృద్ధి
5జీ టెక్నాలజీ తయారీలో ఐఐటీ హైదరాబాద్ ముఖ్యభూమిక పోషించింది. ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ వైసిగ్ వ్యవస్థాపకులు కిరణ్కూచి నేతృత్వంలోని బృందం 5జీ సాంకేతికతను అభివృద్ధి చేసింది. 5జీ టెక్నాలజీకి అవసరమైన ఎన్బీ-ఐవోటీ(NB-IoT) మాడ్యూల్, చిప్ను కిరణ్ కూచి బృందం అభివృద్ధి చేసింది. న్యారో బ్యాండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(NB-IoT) మాడ్యూల్, చిప్ 5జీ ఫోన్కు అవసరమైన జీపీఎస్ నావిగేషన్, ట్రాకింగ్కు ఉపయోగపడుతుంది. ప్రొఫెసర్ కిరణ్కూచి పరిశోధన బృందానికి చెందిన పరిశోధకులు డాక్టర్ ప్రణీత్ న్యారో బ్యాండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(NB-IoT) మాడ్యూల్, చిప్ను ప్రదర్శించారు.
లైట్ వెయిట్ బ్రిడ్జి
ఐఐటీహెచ్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ అనిల్ అగర్వాల్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ర్యాపిడ్లీ డిప్లాయిడ్ లైట్ వెయిట్ బ్రిడ్జి సిస్టమ్ను అభివృద్ధి చేశారు. సైనిక అవసరాల కోసం కార్బన్, ఫైబర్ మిశ్రమాలు, అధిక శక్తిగల సింథటిక్, అల్యూమినియంతో బ్రిడ్జిల నిర్మాణానికి అవసరమైన ప్లేట్లను, అనుసంధాన రాడ్లు, వంతెన డెక్, శాండ్విచ్ ప్యానెళ్లను తయారుచేశారు. 12 మంది సిబ్బంది మోసుకెళ్లి సులువుగా నదుల మీద వంతెన నిర్మించవచ్చు. ఇది టన్ను బరువును ఆపగలదు. కొండచరియలు విరిగిపడినప్పుడు, వరదల సమయంలో ఇది ఎంతో ఉపయోగకరం.
అటానమస్ సైకిల్
ఐఐటీహెచ్లో అటానమస్ నావిగేషన్ ఫౌండేషన్ అటానమస్ ఈ-సైకిల్ను తయారుచేసింది. ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి మార్గదర్శనం లో అక్షయ్, సంతోష్రెడ్డి రూపొందించారు. ఈ-సైకిల్ పెడల్ను తొక్కడంతో పాటు బ్యాటరీతోనూ నడపవచ్చు. టీహాన్ యాప్ ద్వారా ఈ-సైకిల్ సొంతంగా పార్కింగ్ చేసుకోవడంతోపాటు ఉన్నచోటికి తిరిగి వస్తుంది. ఈ- సైకిల్ను ఐఐటీ విద్యార్థులు వాడుతున్నారు. త్వ రలోనే మార్కెట్లోకి రానున్నది.
ఎన్లైట్ 360
నవజాత శిశువుల్లో కనిపించే పచ్చకామెర్లను తగ్గించేందుకు ఇంక్యుబేటర్కు ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు ముద్దం ప్రసాద్, కే అఖిత ‘ఎన్లైట్ 360’పేరుతో ఆటోమెటిక్ ఫొటోథెరపీ యంత్రాన్ని రూపొందించారు. కరెంటు అవసరం లేకుండా బ్యాటరీ ద్వారా నడిచే దీంట్లో శిశువును ఉంచి బరువు నమోదుచేసిన వెంటనే ఎన్లైట్ మిషన్ వ్యాధితీవ్రత అంచనా వేసి చికిత్స చేస్తుంది.
ఎలక్ట్రిక్ బైక్
ఐఐటీహెచ్ ప్రొఫెసర్ నిశాంత్ ‘ప్యూర్ ఈవీ’(PURE EV) స్టార్టప్ను ప్రారంభించారు. ప్యూర్ ఈవీ స్టార్టప్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు, లిథియం బ్యాటరీలను తయారుచేస్తున్నది. ఎగ్జిబిషన్లో ప్యూర్ ఈవీ వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఆర్మ్ ఏబుల్తో ఆడుతూపాడుతూ ఫిజియోథెరపీ
పక్షవాతంతో పట్టుకోల్పోయిన చేతికి ఫిజియోథెరపీ అత్యవసరం. బీఏబుల్ సంస్థ ఐఐటీహెచ్తో కలిసి కంప్యూటర్ ఆధారిత ఆర్మ్ ఏబుల్ పరికరాన్ని రూపొందించింది. కంప్యూటర్ స్క్రీన్కు అనుసంధానం చేసిన రెండు హ్యాండిల్స్ను పట్టుకొని పక్షవాతం రోగులు గేమ్ ఆడుతూ ఫిజియోథెరపీ చేసుకోవచ్చు. పక్షవాతం, వెన్నెముక నొప్పితో ఇబ్బందిపడే రోగులు ఆడుతూ ఫిజియోథెరపీ చేసుకోవచ్చని ఆర్మ్ఏబుల్ ఆవిష్కర్త హబీబ్ తెలిపారు.
పరిశోధనలపై మరింత దృష్టి: ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి
దేశంలోని ఐఐటీలన్నీ పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి వెల్లడిం చారు. గురువారం సంగారెడ్డి మండలం కందిలోని ఐఐటీ హైదరాబాద్లో ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐఐటీలు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను తయారుచేయటమే కాకుండా పరిశోధనల ద్వారా దేశానికి, ప్రజలకు మేలు జరిగేలా చూడనున్నట్టు తెలిపారు. 23 ఐఐటీలు 14, 15 తేదీల్లో ఢిల్లీ ఐఐటీలో ‘ఇన్వెంటివ్ టెక్నాలజీస్’ పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేసినట్టు చెప్పారు. ఈ ఎగ్జిబిషన్లో ఐఐటీల్లోని 75 నూతన ఆవిష్కరణలను ప్రదర్శిస్తామని, ఐఐటీ హైదరాబాద్ నుంచి ఆరు ఆవిష్కరణలు ఎంపికైనట్టు పేర్కొన్నారు. ఐఐటీ హైదరాబాద్ కొత్తగా ఐసీ డిజైన్ ఆండ్ మాన్యుఫాక్చర్ బీటెక్ కోర్సు, సెమీ కండక్టర్స్ డివైస్ అండ్ మెటీరియల్ ఎంటెక్ కోర్సును ప్రారంభించనున్నట్టు చెప్పారు. దేశంలో తొలిసారిగా సిస్టమ్ ప్యాకేజింగ్ ఎంటెక్ కోర్సును కూడా ప్రారంభించనున్నట్టు తెలిపారు. 5జీపై ఐఐటీహెచ్ అభివృద్ధి చేసిన టెక్నాలజీని దేశీయ టెలికమ్యూనికేషన్ కంపెనీలు వాడుకొనేందుకు ముందుకొస్తున్నాయని చెప్పారు. 6జీ పరిశోధనలు కూడా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఐఐటీహెచ్ నూతన ఆవిష్కరణలను ప్రొఫెసర్లు నిశాంత్, దేవరాజ్ భట్టాచార్య, జోత్సేనేందు గిరి, అనిల్, ప్రసాద్ వివరించారు. సమావేశంలో ప్రొఫెసర్ కృష్ణమోహన్, పీహెచ్డీ విద్యార్థులు పాల్గొన్నారు.