జెనీవా: కోవిడ్ రోజుకో అవతారం ఎత్తుతున్నది. తన అంతర్నిర్మాణాన్ని మార్చుకుని ఉగ్రరూపం దాల్చుతున్నది. చైనారకంతో మొదలైన తర్వాత, బ్రిటన్, బ్రెజిల్, ఆఫ్రికా రకాలు వచ్చాయి. ఇప్పుడు భారత్ రకం ప్రపంచమంతటా విజృంభిస్తున్నది. ఈ వైరస్ 44 దేశాల్లో కనిపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీనికి శాస్త్రీయంగా బీ.1.617 అని పేరుపెట్టారు. గత అక్టోబర్ లో ఇది మొదటిసారి కనిపించింది. భారత్ వెలుపల బ్రిటన్లో అత్యధికంగా ఈ వైరస్ ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ రకం వైరస్పై సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కొత్తరకం మూల వైరస్ కన్నా భిన్నంగా ప్రవర్తిస్తున్నది. ఒకరి నుంచి మరొకరికి సత్వరమే వ్యాపించడం, తీవ్రస్థాయిలో అస్వస్థత కలిగించడం, లేదా టీకాకు లొంగకపోవడం అనేవి ఈ వైరస్ లక్షణాలుగా భావిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది ఈ లక్షణాల గురించే. అనేక దేశాల్లో కోవిడ్ కేసుల్లో ఒక్కసారిగా పెచ్చరిల్లడానికి ఈ వైరసే కారణం. 130 కోట్ల జనాభా కలిగిన భారత్ కోవిడ్ కేసుల్లో అమెరికా తర్వాతి స్థానానికి వచ్చింది. రోజుకు 3 లక్షల పైచిలుకు కొత్త కేసులతో, దాదాపు 4 వేల మరణాలతో వైద్యవ్యవస్థ సామర్థ్యాన్ని ఈ వైరస్ పరీక్షకు గురిచేస్తున్నది.