Infosys | గత ఆర్థిక సంవత్సరంలో 85 వేల మంది ఫ్రెషర్లను నియమించుకున్న ఇన్ఫోసిస్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 వేల మంది నియామకానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే, మార్చి త్రైమాసికంలో అట్రిక్షన్ 27.7 శాతం పెరిగిందని ఇన్ఫోసిస్ తెలిపింది. డిసెంబర్ త్రైమాసికంలో 25.5 శాతం మంది ఉద్యోగులు అట్రిక్షన్ బాట పట్టారని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ఫలితాలను ఇన్ఫోసిస్ బుధవారం వెల్లడించింది. అయినప్పటికీ, చివరి త్రైమాసికంలో వాస్తవంగా అట్రిక్షన్ రేటు తగ్గుముఖం పట్టిందని వివరించింది.
వర్క్ ఫ్రం హోం సంస్కృతికి ఐటీ సంస్థలు స్వస్తి పలుకుతుండటంతో సాఫ్ట్వేర్, ఐటీ సర్వీసులకు డిమాండ్ నెమ్మదిస్తున్నదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ రెవెన్యూ గెడైన్స్ 13-15 %గానూ, నిర్వహణ లాభాలు 21-23 శాతంగానూ ఉంటాయని అంచనా వేసింది.
మార్చి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం 12 శాతం పెరిగి రూ.5,686 కోట్ల వద్ద నిలిచింది. విశ్లేషకులు రూ.6000 కోట్ల నికర లాభాలు వస్తాయని అంచనా వేశారు. జనవరి-మార్చి త్రైమాసికంలో సంస్థ ఆదాయం 23 శాతం పెరిగి రూ.32,276 కోట్లకు చేరుకున్నది.
ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాలో తమ సేవలను నిలిపివేయాలని ఇన్ఫోసిస్ తెలిపింది. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నది. రష్యా నుంచి తమ కార్యకలాపాలను ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నట్లు వివరించింది. ఒరాకిల్, ఎన్సీపీ, నొకియా తదితర సంస్థలు రష్యాలో కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. బోరిస్ జాన్సన్ వారసుడిగా.. బ్రిటన్ ప్రధాని అభ్యర్థిగా ఆ దేశ ఆర్థిక మంత్రి రిషి సునాక్ పేరు ముందుకొచ్చినా.. రష్యాలో ఇన్ఫోసిస్ సేవల వల్లే వెనుకబడ్డారని వార్తలొచ్చాయి.