Rishi Sunak | బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ సోమవారం చరిత్ర సృష్టించారు. యావత్ భారతావని దీపావళి పండుగ సంబురాలు జరుపుకుంటుండగా బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ పడిన పెన్నీ మోర్డాంట్ వైదొలగడంతో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తొలి భారత సంతతి నేతగా నిలిచారు.
రిషి విజయంపై… ఆయన మామ, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి స్పందించారు. బ్రిటన్ తదుపరి ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘‘ రిషికి శుభాకాంక్షలు. తనను చూస్తుంటే గర్వంగా ఉంది. రిషి తన బాధ్యతల్లో విజయవంతం కావాలి. బ్రిటన్ ప్రజల ఆకాంక్షల మేరకు రిషి శాయశక్తులా పనిచేస్తారని భావిస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి కుమార్తె అక్షితా మూర్తిని రిషి సునాక్ 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.