136వ ర్యాంక్ సాధించిన స్నేహ
ఆలిండియా సివిల్ సర్వీసెస్కు ఎంపికైన
డాటా ఎంట్రీ ఆపరేటర్ కూతురు
మూడు ప్రయత్నాల్లో విఫలం..
నాలుగోసారికి దక్కిన విజయం
ఇందూరు బిడ్డ సత్తా చాటింది. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన అరుగుల స్నేహ (27) సోమవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో మెరుగైన ర్యాంక్ సాధించింది. తన తల్లికి లభించిన సర్టిఫికెట్లో ఐఏఎస్ అధికారి సంతకాన్ని చూసి తానూ కలెక్టర్ కావాలన్న సంకల్పంతో చదువు కొనసాగించింది. ఐఏఎస్ టార్గెట్గా చదివిన ఆమె తొలి మూడు ప్రయత్నాల్లో విఫలమైనా నిరాశతో కుంగిపోలేదు. తన జీవిత ఆశయాన్ని అంతటితోనే వదులుకోలేదు. ఎలాగైనా సాధించాలనే తపనతో ముందడుగు వేసింది. నాలుగో ప్రయత్నంలో విజయం సాధించింది. అది కూడా మామూలుగా కాదు.. ఆలిండియా లెవల్లో 136వ ర్యాంకు సాధించి నిజామాబాద్ జిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసింది. తన తల్లి అందించిన ప్రోత్సాహంతోనే సివిల్స్ సాధించినట్లు స్నేహ తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విజయ ప్రస్థానాన్ని వివరించారు.
ఇందూరు, మే 30 : సివిల్స్లో ఇందూరు బిడ్డ మెరిసింది. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్-2021 తుది ఫలితాలు సోమవారం వెల్లడికాగా, నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన అరుగుల స్నేహ 136వ ర్యాంకు సాధించి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన స్నేహ.. ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో కష్టపడి చదివింది. తన తల్లికి లభించిన సర్టిఫికెట్లో ఐఏఎస్ అధికారి సంతకం చూసి ఎలాగైనా సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో ప్రిపేర్ అయ్యింది. మూడుసార్లు విఫలమైనా, నాలుగో ప్రయత్నంలో మాత్రం తన జీవిత ఆశయాన్ని నెరవేర్చుకున్నది. ఆలిండియా స్థాయిలో 136వ ర్యాంకు సాధించి నిజామాబాద్ జిల్లాకు పేరు తీసుకురావడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ర్యాంకు సాధించి ఎందరిలో స్ఫూర్తి నింపిన స్నేహ.. నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది.
‘నమస్తే’ : ఐఏఎస్ సాధించడానికి ప్రేరణ ఎవరు?
స్నేహ : నిజామాబాద్లో జన్మించిన నాకు అమ్మే అన్ని తానై పెంచింది. మా అమ్మకు వచ్చిన సర్టిఫికెట్ను చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఆ సర్టిఫికెట్లో వినయ్కుమార్ ఐఏఎస్ అనే సంతకం చూసి.. ఎలాగైనా నేను కూడా ఐఏఎస్ కావాలనుకొని అప్పుడే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న.
సమాజానికి ఏం చేయాలనుకుంటున్నారు.. మీ లక్ష్యం ఏమిటి ?
సమాజానికి నా వంతు సేవలు అందిస్తా. ముఖ్యంగా మహిళా సాధికారత కోసం కృషి చేస్తాను. నాలాంటి ఎందరో మహిళలకు తోడ్పాటునందించాలనుకుంటున్నాను. విద్య, వైద్యం ఇవి రెండు సరిగ్గా అందినప్పుడే మహిళా సాధికారిత సాధించగలుగుతాం.
ఫెయిల్ అయినప్పుడు ఎలా ఫీలయ్యారు ?
మూడోసారి ర్యాంకు వస్తదని చాలా కష్టపడ్డాను. కానీ ఒక్క మార్కుతో ర్యాంకు రాకపోయేసరికి కొంత ఆత్మన్యూనతకు లోనయ్యాను. ఇంటర్వ్యూ అయ్యాక .. పది రోజుల్లోనే మళ్లీ ప్రిలిమ్స్ ఉండే. ఆ పది రోజులు సరిపోవు. మళ్లీ అటెండ్ చేద్దామా వద్దా అనే ఆలోచనలో పడ్డాను. అమ్మ ప్రోత్సాహంతో ఎలాగైనా సరే ఈసారి వదిలేది లేదు.. అని చదవడానికి కూర్చున్న.. బాధను దిగమింగుకొని లక్ష్యం వైపు అడుగులు వేశాను. మెయిన్స్లో 797, ఇంటర్వ్యూలో 179 మార్కులు వచ్చాయి.
ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయ్యే వారికి మీరు ఇచ్చే సలహా ?
ఎవరైనా సరే సమయం కేటాయించి చదివి లక్ష్యం వైపు అడుగులు వేస్తే తప్పక సాధిస్తారు. ఎన్నిసార్లు ఓడినా ధైర్యంగా ప్రణాళికతో చదివితే విజయం వరిస్తుంది.
మీ కుటుంబ నేపథ్యం..?
మాది మధ్యతరగతి కుటుంబం. ఇంట్లో అమ్మ, చెల్లి, నేను ఉంటాం. చెల్లెలు సుప్రియ మ్యూజిక్ టీచర్గా ఆన్లైన్లో మ్యూజిక్ నేర్పిస్తుంది.