న్యూఢిల్లీ : దేశంలో తయారైన కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను యూరోపియన్ యూనియన్ (ఈయూ) గుర్తించకపోవడం భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈయూ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వ్యాక్సిన్లకు గుర్తింపు ఇవ్వకుంటే యూరప్ నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్ నిబంధనను తప్పనిసరి చేయనున్నట్లు హెచ్చరించింది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లను గుర్తించకపోవడంతో.. ఉద్యోగాలు, చికిత్స, అధ్యయనాలు తదితర అవసరాల కోసం యూరప్ వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ విషయంలో ఈయూతో భారత్ చాలాసార్లు చర్చించింది. అయినప్పటికీ, రెండు టీకాలను డిజిటల్ కొవిడ్ సర్టిఫికెట్లో గుర్తించలేదు. ఈ క్రమంలో భారత్ కఠిన వైఖరి తీసుకోనున్నది. దీంతో ఆయా దేశాల వ్యాక్సిన్ సర్టిఫికెట్లను అంగీకరించరు. యూరప్ నుంచి నేరుగా భారత్కు వచ్చేవాళ్లు తప్పనిసరి క్వారంటైన్ ఉండాల్సి ఉంటుంది. అయితే, ఈ పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే యూరోపియన్ యూనియన్ డిజిటల్ సర్టిఫికెట్లో తప్పనిసరిగా భారత టీకాలను నోటిఫై చేయాలని సూచించినట్లు విదేశాంగ వర్గాలు పేర్కొన్నాయి.
గురువారం నుంచి అందుబాటులోకి గ్రీన్పాస్ పథకం
యూరోపియన్ యూనియన్ డిజిటల్ కోవిడ్ సర్టిఫికేట్ పథకం లేదా ‘గ్రీన్ పాస్’ పథకం గురువారం నుంచి అమల్లోకి వస్తుంది. దీని ద్వారా కరోనా మహమ్మారి సమయంలో కదలికలను సులభతరం కానున్నాయి. యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ (ఈఎంఏ) చేత అధికారం పొందిన టీకాలు పొందిన వ్యక్తులకు ఈయూలో ప్రయాణ పరిమితుల నుంచి మినహాయింపు ఉంటుంది. వ్యక్తిగత సభ్య దేశాలకు జాతీయ స్థాయిలో లేదంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారం ఇచ్చిన వ్యాక్సిన్లను అంగీకరించే స్వేచ్ఛ కూడా ఉంది.
భారత్లో కరోనాకు వ్యతిరేకంగా తీసుకున్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు తీసుకున్న వ్యక్తులకు కొవిన్ పోర్టల్ ద్వారా జారీ చేసిన సర్టిఫికెట్పై ప్రత్యేకంగా మినహాయింపులు ఇవ్వాలని ఈయూ సభ్యదేశాలను కోరినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టీకాల వినియోగానికి సంబంధించిన వివరాలను కొవిన్ పోర్టల్లో ధ్రువీకరించుకోవచ్చని, ఈయూ డిజిటల్ కొవిడ్ సర్టిఫికెట్ గుర్తింపు కోసం భారతదేశం సైతం ఇదే విధమైన పరస్పర మార్పిడి విధానాన్ని కలిగి ఉంటుందని తెలిపినట్లు ఈయూ దేశాలకు చెప్పినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా.. డిజిటల్ కొవిడ్ సర్టిఫికేట్ లేదా గ్రీన్పాస్ జారీ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన కోవిషీల్డ్ వంటి టీకాలను ఆమోదించే అవకాశం సభ్యదేశాలకు ఉందని యూరోపియన్ యూనియన్ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. కొవిషీల్డ్ ఆమోదం లభించకపోవడంతో ఈ టీకా పొందినవారు ఐరోపా సభ్య దేశాల్లో ప్రయాణం చేయలేరన్న ఆందోళనలు నెలకొన్న క్రమంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం.
ఈయూ సభ్యదేశాలు కోవిషీల్డ్ తోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన అన్ని టీకాలనూ ఆమోదించవచ్చని సదరు అధికారి తెలిపారు. యూరోపియన్ యూనియన్ ప్రతినిధి జోసెఫ్ బోరెల్ ఫోంటెల్లెస్తో మంగళవారం జరిగిన సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ కొవిడ్ సర్టిఫికెట్ పథకంలో కొవిషీల్డ్ను చేర్చే అంశంపై చర్చించారు.