అహ్మదాబాద్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల గడుస్తున్న తరుణంలో ప్రత్యేక కార్యక్రమాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్లో జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ స్వయంసమృద్ధి సాధించిందని, దీని వల్ల ప్రపంచ దేశాలకు కూడా ఉపయోగం జరిగిందన్నారు. భారత్ సాధించిన ఘనతలన్నీ కేవలం మన దేశానికే కాదు అని, ఆ ఘనతలు యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రధాని తెలిపారు. స్వయంసమృద్ధితో నిండిన మన దేశ ప్రయాణం.. ప్రపంచ దేశాల అభివృద్ధిని కూడా వేగవంతం చేస్తుందని ప్రధాని అన్నారు.
దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన వారిని మోదీ గుర్తు చేసుకున్నారు. లోకమాణ్య తిలక్ పూర్ణ స్వరాజ్యం పిలుపును మరిచిపోలేమన్నారు. మంగళ్ పాండే, తాంతియా థోపే, రాణీ లక్ష్మీభాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, పండిట్ నెహ్రూ, సర్దార్ పటేల్, అంబేద్కర్ లాంటి వారు మనకు ప్రేరణగా నిలిచారన్నారు. దేశ స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చేందుకు యువత, విద్యావంతులు బాధ్యత తీసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. మన దేశం సాధించిన ఘనతను ప్రపంచ దేశాలకు తెలియజేయాలన్నారు.
కళలు, సాహిత్యం, నాటక రంగం, చిత్ర పరిశ్రమ, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగాలకు చెందిన వారు స్వాతంత్రోద్యమానికి చెందిన విశిష్టమైన కథలను విస్తృత ప్రచారం చేయాలని ప్రధాని కోరారు. మన రాజ్యాంగం పట్ల గర్వంగా ఫీలవాలన్నారు. ప్రజాస్వామ్య సాంప్రదాయాల పట్ల గర్వపడాలన్నారు. ప్రజాస్వామ్యానికి ఇండియా తల్లి వంటిదని, ఆ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. దేశ వైభవోపత చరిత్రను సంరక్షించేందుకు గత ఆరేళ్ల నుంచి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రధాని వెల్లడించారు. ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు.