న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రతిఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్లు హల్చల్ చేస్తున్నాయి. ఇంటర్నెట్, శాటిలైట్ టెలివిజన్లు అందుబాదులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చీమచిటుక్కుమన్నా క్షణాల్లోనే జనబాహుళ్యంలోకి వెళ్తున్నది. అయితే ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానిరోజుల్లో ఉత్తరం ఒక వెలుగువెలిగింది. మంచికైనా.. చెడుకైనా అంతరంగాన్ని వ్యక్తంచేయడానికి ఉత్తరమే వేదికైంది. అలాంటి ఉత్తరం మనం పంపిన చిరునామాకు చేరాలంటే ప్రధానంగా ఉండాల్సింది పిన్కోడ్. ఆ ఆరంకెల సంఖ్య ఆధారంగానే ఉత్తరాన్ని పోస్టుమ్యాన్ బట్వాడా చేస్తాడు. పోస్టల్ విధానంలో అంతటి ప్రాధాన్యమున్న పిన్కోడ్ నేటితో 50 ఏండ్లు పూర్తిచేసుకుంటున్నది.
పోస్టల్ శాఖలో పిన్కోడ్ వ్యవస్థ 1972, ఆగస్టు 15న ప్రారంభమైంది. అప్పటి కేంద్ర సమాచార ప్రసార శాఖ అదనపు కార్యదర్శి శ్రీరామ్ భికాజి వెలాంకర్ పిన్కోడ్ నంబర్ను ప్రవేశపెట్టారు. ఆరంకెలు ఉండే పిన్కోడ్ సహాయంతో ఉత్తరాలను పంపిణీ చేస్తారు. ఇందులో ఒక్కో అంకె ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తుంది.
మొదటి అంకె తపాలా కార్యాలయం గల ‘ప్రాంతాన్ని’, రెండో అంకె ‘ఉప-ప్రాంతాన్ని’, మూడో అంకె ‘జిల్లాను’, ఆఖరి మూడు అంకెలు ‘వ్యక్తిగత తపాలా కార్యాలయాల సంఖ్యను’ సూచిస్తాయి. పోస్టల్ సర్వీసులను సులభంగా నిర్వహించడానికి దేశం మొత్తాన్ని 23 పోస్టల్ సర్కిళ్లుగా విభజించారు.