న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఆర్థిక కార్యకలాపాలను దెబ్బతీయడంతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైన కారణంగా 2020-21లో దేశ జీడీపీపై ఆ ప్రభావం పడింది. 2021 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ ఏకంగా 7.3 శాతం పతనమైంది. ఆర్థిక సంవత్సరం చివరన జనవరి-మార్చి (నాలుగో త్రైమాసం)లో ఆర్థిక కార్యకలాపాలు కొంతమేర గాడినపడటంతో జీడీపీ 1.3 శాతం పెరిగిందని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి.
కొవిడ్-19 విరుచుకుపడటంతో గత ఏడాది సుదీర్ఘ లాక్ డౌన్ లు, కఠిన నియంత్రణలతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. టూరిజం, విమానయానం, వినోద, ఆతిథ్య రంగాలు సహా పలు రంగాలు కుదేలయ్యాయి. చిన్న మధ్యతరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. వేలాది ఉద్యోగాలు కోల్పోవడంతో పాటు చిరు వ్యాపారులు చితికిపోయారు. ఇక 2021-22 ఆర్థిక సంవత్సరంలో గత ఏడాదితో పోలిస్తే రెండంకెల ఆర్థిక వృద్ధి రేటు నమోదవుతుందనే అంచనాలు వెల్లడయ్యాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ ఆర్ధిక వ్యవస్థ రికవరీకి అడ్డుకట్ట వేస్తుందనే ఆందోళన రేకెత్తుతోంది.