న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో గురుద్వారా బంగ్లా సాహిబ్ ప్రాంగణంలో 101 బెడ్లతో కిడ్నీ డయాలసిస్ కేంద్రం కొలువు దీరింది. ఆదివారం నుంచి రోగులకు సేవలు ప్రారంభించిన ఈ డయాలసిస్ కేంద్రంలో చికిత్స ఉచితం. దేశంలోకెల్లా అతిపెద్ద డయాలసిస్ కేంద్రం ఇది. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (డీఎస్జీఎంసీ) దీన్ని ప్రారంభించింది. గురుద్వారా కాంప్లెక్స్లో గురు హర్కిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కిడ్నీ డయాలసిస్ హాస్పిటల్ను స్థాపించారు.
ఈ కేంద్రంలో డయాలసిస్ చికిత్స కోసం అడ్మిట్ అయ్యే రోగుల నుంచి ఫీజులు వసూలు చేసేందుకు క్యాష్ కౌంటర్గానీ, బిల్లింగ్ కౌంటర్గానీ లేవు. రోగులకు చికిత్సతోపాటు వారికి సహాయకులుగా వచ్చే అటెండెంట్లకు కూడా ఉచితంగానే భోజన వసతి కల్పిస్తారు. గురుద్వారా నుంచి లంగర్ భోజనం సరఫరా అవుతుందని దవాఖాన వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఉన్న 101 బెడ్ల సామర్థ్యాన్ని భవిష్యత్లో 1000 బెడ్లకు పెంచనున్నట్లు ఆ వర్గాల కథనం. ఈ దవాఖాన నిర్వహణకు కార్పొరేట్ దిగ్గజాల, వ్యక్తుల నుంచి విరాళాలు సేకరిస్తామని గురుద్వారా కమిటీ తెలిపింది. ప్రభుత్వ పథకాలనూ అమలు చేస్తామని పేర్కొంది.
డీఎస్జీఎంసీ అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిర్సా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సాంకేతికంగా అత్యంత ఆధునికమైన ఈ దవాఖానలో అన్ని రకాల సేవలు పూర్తిగా ఉచితం. ఇందులో బిల్లింగ్ లేదా పేమెంట్ కౌంటర్ ఉండవు. సామాజిక బాధ్యతను నెరవేర్చేందుకు ముందుకు వచ్చేవారితోపాటు కార్పొరేట్ సంస్థల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) సేవలను, వివిధ ప్రభుత్వాల పథకాలను రోగులకు సేవలందించేందుకు ఉపయోగిస్తాం’ అని చెప్పారు.
టెక్నికల్గా, అత్యాధునిక వైద్య వసతులతో దవాఖాన ఏర్పాటైందని, త్వరలో 24 గంటల పాటు సేవలందిస్తుందని మంజిందర్ సింగ్ చెప్పారు. ప్రస్తుతానికి దవాఖానకు వచ్చిన రోగులకు చికిత్సనందిస్తుందని, ఆన్లైన్ వ్యవస్థ రూపుదిద్దుకున్న తర్వాత రోగుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం అవుతుందని దవాఖాన వర్గాలు తెలిపాయి.