అహ్మదాబాద్, డిసెంబర్ 5: దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని, భారతీయులు నిరాశలో ఉన్నారని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ అన్నారు. ప్రజలు తీవ్ర వేదన అనుభవిస్తున్నారని వాపోయారు. 2019తో పోల్చితే భారత ఆర్థిక వ్యవస్థలో ఇంకా వృద్ధి ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. కరోనా ముందు కన్నా జీడీపీ తక్కువగా ఉన్నదని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా ప్రజల చిరు ఆకాంక్షలు కూడా నెరవేరడం లేదని, వారి ఆశలు కుంచించుకుపోతున్నాయని పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ వర్సిటీ 11వ స్నాతకోత్సవం ఆన్లైన్లో జరిగింది. ఇందులో అభిజిత్ బెనర్జీ వర్చువల్గా పాల్గొన్నారు. ఎన్డీయే పాలనలో దేశంలోని అనేక కీలక రంగాలు కునారిల్లి పోతున్న నేపథ్యంలో అభిజిత్ బెనర్జీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘దేశ ఆర్థిక వ్యవస్థ తగ్గింది. ఎంత తగ్గిందనేది లెక్కల్లేవు. కానీ కచ్చితంగా భారీగా తగ్గింది. నేను ఎవరినీ తప్పు పట్టట్లేదు. చెప్తున్నాను అంతే’ అని వ్యాఖ్యానించారు. విద్యార్థులు సమాజం గురించి ఆలోచించాలన్నారు. తాము నేర్చుకొన్నదానితో దేశానికి చేతనైనంత సేవ చేయాలన్నారు. ‘సమాజం మీ నైపుణ్యాలను, సామర్థ్యాలను, నిబద్ధతను కోరుతున్నది. వ్యాపారాలు ప్రారంభించండి. ఉద్యోగాలు కల్పించండి. సామాజిక న్యాయం కోసం పోరాడండి. పుస్తకాలు రాయండి. ప్రజలను చైతన్యవంతులను చేయండి’ అని పిలుపునిచ్చారు.
ఒత్తిడికి లొంగవద్దు
విద్యార్థులు తమ కెరీర్ను ఎంచుకోవడంలో కుటుంబం, సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిడులకు లొంగవద్దని సూచించారు. తాము ఏం సాధించాలనుకొంటున్నారో ఆ మార్గంలో ధైర్యంగా నడవాలన్నారు. సత్యజిత్ రే, శ్యామ్ బెనెగల్ ఇద్దరూ ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారని, కానీ తాము అనుకొన్న మార్గంలో నడిచి ఆ రంగంలో దిగ్గజాలుగా నిలిచారని చెప్పుకొచ్చారు. 2019లో అభిజిత్కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ వచ్చింది.