దంబుల్లా: ఇప్పటికే సిరీస్ చేజిక్కించుకున్న భారత మహిళల జట్టు.. సోమవారం శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (39 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా.. జెమీమా రోడ్రిగ్స్ (33), స్మృతి మందన (22), సబ్బినేని మేఘన (22) ఫర్వాలేదనిపించారు. అనంతరం లక్ష్యఛేదనలో కెప్టెన్ చమరి ఆటపట్టు ( 48 బంతుల్లో 80 నాటౌట్; 14 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టడంతో లంక 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ఈ క్రమంలో శ్రీలంక తరఫున అంతర్జాతీయ టీ20ల్లో 2 వేల పరుగుల మార్క్ దాటిన తొలి క్రికెటర్గా చమరి రికార్డుల్లోకెక్కింది. దిల్షాన్ (1889) రెండో స్థానంలో ఉన్నాడు. మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకోగా.. చమరికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, హర్మన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.