కీవ్/న్యూఢిల్లీ, మార్చి 1: ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న దాడుల్లో భారతీయ విద్యార్థి ఒకరు మరణించిన నేపథ్యంలో అక్కడ చిక్కుకొని ఉన్న భారతీయుల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. సరిహద్దులో ఉన్న పొరుగు దేశాలకు చేరుకోవడంలో విద్యార్థులకు అనేక ఆటంకాలు ఎదురౌతున్నాయి. రవాణా సదుపాయం లేక సాయం కోసం అభ్యర్థిస్తున్నారు. దక్షిణ ఉక్రెయిన్లో మైకోలైవ్ పట్టణంలోని ఓ యూనివర్సిటీకి చెందిన 66 మంది భారతీయ విద్యార్థులు అక్కడి ఓ హాస్టల్లో చిక్కుకుపోయారు. నగరంలో పరిస్థితులు క్షీణించిన నేపథ్యంలో తమను వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని ఇండియన్ ఎంబసీని మంగళవారం అభ్యర్థించారు. బాలయోగి అనే మెడికల్ విద్యార్థి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘మా చుట్టూ బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. సరిపడా ఆహారం లేదు. చలి కూడా తీవ్రంగా ఉంది. వీలైనంత త్వరగా సాయం చేయాలని ఎంబసీ అధికారులను కోరాం’ అని పేర్కొన్నారు. ఎంబసీతో పాటు తమ ఏజెంట్లకు ఫోన్ చేసినా వారి నుంచి సరైన స్పందన లేదని చెప్పారు. ఉక్రెయిన్ వీడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థులను ఆ దేశ సైనికులు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
కొనసాగుతున్న తరలింపు ప్రక్రియ
రొమేనియా రాజధాని బుకారెస్ట్, హంగరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి మంగళవారం 616 మంది దేశానికి చేరుకున్నారు. భారతీయుల తరలింపు ప్రక్రియ చేపట్టాలని ప్రధాని మోదీ వైమానిక దళానికి సూచించారు.
మరో 13 మంది మనోళ్లు వచ్చారు
హైదరాబాద్, మార్చి1 (నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను స్వస్థలాలకు తీసుకువచ్చే ప్రక్రియ శరవేగంగా జరుగుతున్నది. గతనెల 26వ తేదీ నుంచి ఇప్పటి వరకు 67 మంది విద్యార్థులను ఇండియాకు తీసుకువచ్చారు. మంగళవారం బుకారెస్ట్ నుంచి మూడు ప్రత్యేక విమానాల్లో 13 మంది తెలంగాణ విద్యార్థులను తీసుకువచ్చారు. ఢిల్లీ, ముంబైలలో దిగిన తెలంగాణ విద్యార్థులను మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశాల మేరకు అధికారులు రిసీవ్ చేసుకున్నారు.