కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని ఉంటే ఇన్ని ఇబ్బందులు పడేవాళ్లం కాదు. మేం ఇప్పుడు ఇక్కడికి చేరుకొన్నాం.. కాబట్టి మీరు పువ్వులతో స్వాగతం పలుకుతున్నారు. రాకపోయి ఉంటే ఏం చేసేవారు? మా కుటుంబాలు ఏం అయిపోయేవి? ఈ పువ్వులను ఏం చేసుకోవాలి? దేనికి పనికివస్తాయి? సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోకుండా, మేం వచ్చిన తర్వాత పువ్వులతో స్వాగతం చెప్పడం ఏంటి?
–కేంద్రంపై బీహార్ విద్యార్థి దివ్యాంశు సింగ్ ఆగ్రహం
న్యూఢిల్లీ, మార్చి 3: బీహార్ రాష్ర్టానికి చెందిన దివ్యాంశు సింగ్ ఉక్రెయిన్లో చిక్కుకుపోయాడు. అతి కష్టమ్మీద దేశ సరిహద్దు దాటి హంగేరీ చేరాడు. అక్కడి నుంచి విమానంలో గురువారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయం చేరుకొన్నాడు. దివ్యాంశు ఢిల్లీ ఎయిర్పోర్టులో దిగగానే కేంద్రప్రభుత్వ ప్రతినిధులు ఆయనకు గులాబీ పువ్వులను ఇస్తూ స్వాగతం పలికారు. అధికారుల స్వాగతాన్ని దివ్యాంశు తిరస్కరించాడు. ‘భారతీయులను తరలించడానికి సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోకుండా, మేం వచ్చిన తర్వాత పువ్వులతో స్వాగతం చెప్పడం ఏంటి’ అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశాడు. ఉక్రెయిన్లో భారత రాయబార కార్యాలయం నుంచి తమకు ఎలాంటి సహాయం అందలేదని చెప్పాడు. ‘మేము కష్టపడి సొంతంగా రాకపోయి ఉంటే ఏం చేసేశారు. మా కుటుంబాలు ఏం అయిపోయేవి. ఈ పువ్వులను ఏం చేసుకోవాలి. దేనికి పనికివస్తాయి’ అని ప్రశ్నించారు. భారతీయుల తరలింపులో మోదీ సర్కారు విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మరోవైపు, గడిచిన 24 గంటల్లో ఉక్రెయిన్లో చిక్కుకొన్న 3 వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్టు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకూ 6,400 మందిని తీసుకొచ్చినట్టు పేర్కొంది. యుద్ధం నేపథ్యంలో 18 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ను విడిచి వెళ్లారని పేర్కొంది.
ఉక్రెయిన్ నుంచి 10 లక్షల మంది వలస
యుద్ధం వల్ల ఇప్పటి వరకు 10 లక్షల మంది పౌరులు ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. యుద్ధంలో 227 మంది పౌరులు మరణించారని వెల్లడించింది. యుద్ధంలో 9 వేల మంది రష్యా సైనికులు మరణించినట్టు జెలెన్స్కీ పేర్కొన్నారు.
170 మంది తెలంగాణ విద్యార్థుల రాక
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్లో చిక్కుకున్న 170 మంది తెలంగాణ విద్యార్థులు గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. విద్యార్ధులకు రాష్ట్ర అధికారులు విమాన టికెట్లు ఇచ్చి స్వస్థలాలకు పంపించారు. ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకు 281 మంది తెలంగాణ విద్యార్థులు వచ్చారు.