న్యూఢిల్లీ, మార్చి 1: ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతీయ విద్యార్థి నవీన్ (21) ప్రాణాలు కోల్పోయాడు. నవీన్ మృతిని భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. మృతి పట్ల సంతాపం ప్రకటించింది. నవీన్ కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. విద్యార్థి మరణం విషయం తెలిసిన వెంటనే భారత విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా రష్యా, ఉక్రెయిన్ రాయబారులతో మాట్లాడారు. భారతీయ విద్యార్థులను క్షేమంగా తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నవీన్ స్వస్థలం కర్ణాటకలోని హవేరి జిల్లా. ఖార్కీవ్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. రెండు మూడు రోజులుగా ఖార్కీవ్పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఓ బంకర్లో తలదాచుకొన్నాడు. అయితే ఆహారం అయిపోవడంతో అన్నం, డబ్బు కోసం మంగళవారం బయటకు వచ్చాడు. అదే సమయంలో రష్యా బాంబులు వేయడంతో మృత్యువాత పడ్డాడు. నవీన్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. నవీన్ తండ్రి శేఖరగౌడతో ఫోన్లో మాట్లాడారు. సానుభూతి తెలిపారు.
ఖార్కీవ్లో ఎంబసీ ఏమీ చేయట్లేదు
ఖార్కీవ్లో చిక్కుకుపోయిన విద్యార్థులను తరలించడం కోసం భారత రాయబార కార్యాలయం నుంచి ఎవరూ వెళ్లలేదని నవీన్ తండ్రి శేఖరగౌడ ఆరోపించారు. ఖార్కీవ్లో బంకర్లలో నవీన్తో పాటు చాలా మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని నవీన్ బంధువు ఉజ్జనగౌడ చెప్పారు. శేఖరగౌడతో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మాట్లాడారు. సానుభూతి తెలిపారు. నవీన్ మృతదేహాన్ని తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకొంటామన్నారు.
మొదట్లో కేంద్రం అశ్రద్ధ
ఉక్రెయిన్ సమీపంలో రష్యా బలగాలను మోహరించినప్పటి నుంచి అక్కడ ఉన్న భారతీయ విద్యార్థుల భద్రతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. రష్యా ప్రత్యక్ష దాడులను ప్రారంభించేవరకు కేంద్ర ప్రభుత్వం దీనిపై శ్రద్ధ పెట్టలేదని పలువురు విమర్శిస్తున్నారు. అక్కడి రాయబార కార్యాలయం కూడా క్షేత్ర స్థాయికి తగినట్టుగా సూచనలు చేయలేదు. ఫలితంగా వేలాది మంది భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. ఇప్పుడు హడావుడిగా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నదని చెబుతున్నారు. కానీ ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు, రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండటంతో ఇండ్ల నుంచి కనీసం బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారతీయులు కీవ్, ఖార్కీవ్ నగరాల నుంచి సరిహద్దుల వరకు ఎలా వెళ్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కీవ్ను తక్షణం వీడండి!
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్లో చిక్కుకున్న విద్యార్థులతో సహా భారతీయులందరూ వెంటనే నగరాన్ని విడిచివెళ్లిపోవాలని అక్కడి రాయబార కార్యాలయం సూచించింది. ఈ మేరకు మంగళవారం అడ్వైజరీ జారీచేసింది. అందుబాటులో ఉన్న రైళ్లు, ఇతర రవాణా సదుపాయాల ద్వారా వెళ్లాలని పేర్కొన్నది. కీవ్ నగరం వైపునకు రష్యా యుద్ధ కాన్వాయ్ దూసుకొస్తున్న నేపథ్యంలో ఎంబసీ ఈ సూచన చేసింది. ఉద్రిక్తతలు పెరుగడంతో కార్యాలయాన్ని మూసేసిన ఎంబసీ సిబ్బంది పశ్చిమ సరిహద్దులకు చేరుకొన్నారని సమాచారం.
ఖార్కీవ్లో పరిస్థితి దారుణం
మిర్యాలగూడ విద్యార్థి తండ్రి
మిర్యాలగూడ టౌన్, మార్చి 1: ఖార్కీవ్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న మా బాబు పెరుమాళ్ల అజయ్ వారం రోజుల నుంచి బంకర్లో తలదాచుకున్నాడు. పోలాండ్ సరిహద్దుల్లోకి రైల్లో వెళ్దామంటే అనుమతించడం లేదు. కేవలం ఉక్రెయిన్ పౌరులనే అనుమతిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు రైళ్లు వెళ్లినా మన దేశ విద్యార్థులను ఎక్కించడం లేదు. ఎప్పుడు ఏమవుతుందోనని భయంభయంగా గడుపుతున్నారు. ఖార్కీవ్ నుంచి పోలాండ్ సరిహద్దు దాదాపు 1500 కిలోమీటర్లు దూరం.