న్యూఢిల్లీ: ఆల్ ఇంగ్లండ్ టోర్నమెంట్ ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నది. అయితే ఆ టోర్నీ ప్రారంభానికి ముందే.. భారత షట్లర్లు ముగ్గురికి కరోనా వైరస్ సంక్రమించినట్లు తెలుస్తోంది. ముగ్గురు ఆటగాళ్లతో సహ ఓ సపోర్ట్ సిబ్బందికి కూడా వైరస్ సోకింది. దీంతో ఆ ప్లేయర్లు ప్రాక్టీసుకు దూరం అయ్యారు. ఇటీవల జూరిచ్లో జరిగిన స్విస్ ఓపెన్ సమయంలో ఐసోలేషన్లో ఉన్నట్లు భారత కోచ్ మథియాస్ బో తెలిపారు. గత 14 రోజుల్లో 5 సార్లు టెస్ట్ చేశారని, అన్ని పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని, అయితే అకస్మాత్తుగా ప్లేయర్లు ఎలా పాజిటివ్గా వచ్చారో తెలియదన్నాడు. అయితే ఏయే ప్లేయర్లకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న అంశాన్ని భారత్ వెల్లడించలేదు. సైనా నెహ్వాల్ తన కరోనా పరీక్ష ఫలితం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా టెస్టింగ్ ప్రక్రియను కశ్యప్ తప్పుపట్టాడు. 31 గంటల తర్వాత కూడా ఫలితాలు ఇవ్వడం లేదని అతను తన ట్వీట్లో ఆరోపించాడు. టోర్నీ కోసం తాను ప్రాక్టీసు చేయలేకపోయినట్లు సైనా కూడా ఫిర్యాదు చేసింది. రెండు రోజుల నుంచి జిమ్ లేదు, ప్రాక్టీసు లేదని సైనా తన ట్వీట్లో పేర్కొన్నది. కరోనా పరీక్ష ఫలితాల్లో జాప్యం వల్ల టోర్నీ మ్యాచ్లు ఆలస్యంగా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.