హైదరాబాద్: భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. వేసవి సందర్భంగా వివిధ ప్రాంతాలకు 574 ప్రత్యేక రైళ్లు (Summer specials trains) నడుపుతున్నట్లు ప్రకటించింది. ఇవి ఈ నెలాఖరు నుంచి జూన్ వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇందులో తిరుపతి-హైదరాబాద్, తిరుపతి-ఔరంగాబాద్ మధ్య 20 ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయని దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఈనెల 30 నుంచి వారాంతాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు చెప్పారు. హైదరాబాద్-తిరుపతి (07509) రైలు శనివారం సాయంత్రం 4.35కు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుందని మరుసటిరోజు ఉదయం 5.30 గంటలకు తిరుపతి చేరుకుంటుందని వెల్లడించారు. ఈ రైలు ఏప్రిల్ 30, మే 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
అదేవిధంగా తిరుపతి-హైదరాబాద్ రైలు (07510) మంగళవారం 11.50 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుందని మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ చేరకుంటుందని వెల్లడించారు. ఈ సర్వీసు మే 3, 10, 17, 24, 31 తేదీల్లో అందుబాటులో ఉంటుందన్నారు.
ఇక తిరుపతి-ఔరంగాబాద్ (07511) స్పెషల్ ట్రెయిన్ ఆదివారం ఉదయం 07.05 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుందని, మరుసటి రోజు 7 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుందని వెల్లడించారు. ఇది మే 1, 8, 15, 22, 29 తేదీల్లో నడుస్తుందని చెప్పారు. ఔరంగాబాద్ (07512) నుంచి సోమవారం రాత్రి 11.15 గంటలకు బయలుదేరుతుందని మరుసటి రోజు రాత్రి 10.15 గంటలకు తిరుపతి చేరుకుంటుందని తెలిపారు. ఇది మే 2, 9, 16, 23, 30 తేదీల్లో అందుబాటులో ఉంటుందన్నారు. ఇవి సత్తెనపల్లి, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర మీదుగా వెళ్తాయని చెప్పారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.