న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశంలో మెడికల్ ఆక్సిజన్ సంక్షోభం నెలకొంది. ప్రాణవాయువు అందక పలువురు రోగులు మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేగంగా, తక్కువ ఖర్చుతో ఆక్సిజన్ సరఫరా చేసేందుకు రైల్వే ప్రత్యేకంగా ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లను నడుపుతోంది. మంగళవారం ఉదయం వరకు దాదాపు 450 టన్నుల ఆక్సిజన్ను దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు భారతీయ రైల్వే తెలిపింది. 90 టన్నులకుపైగా ఆక్సిజన్ లోడెడ్ ట్యాంకర్లు బొకరో నుంచి జబల్పూర్, భోపాల్ సమీపంలోని మందదీప్ వరకు, ఉత్తరప్రదేశ్కు ఆక్సిజన్ తీసుకువచ్చేందుకు మూడు ట్యాంకర్లు బొకరోకు వెళ్తున్నాయని చెప్పింది.
మంగళవారం 65 టన్నుల ప్రాణవాయువుతో మొదటి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలు దేశ రాజధానికి చేరుకుందని రైల్వే చెప్పింది. దేశవ్యాప్తంగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ), ఆక్సిజన్ సిలిండర్లను రవాణా చేసేందుకు మరికొన్ని రోజులు రోల్ ఆన్ రోల్ ఆఫ్ ప్రాతిపదికన రైళ్లను నడుపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. ఎల్ఎంఓను వైద్య సంబంధిత అవసరాల కోసం మాత్రమే అనుమతిస్తామని హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది.