వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ 20 ఏండ్ల విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఇండియానాపోలిస్కు చెందిన భారత సంతతి విద్యార్థి వరుణ్ మనీష్ చద్దా ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో డాటాసైన్స్ చదువుతూ.. వర్సిటీ క్యాంపస్లోని మెక్కట్చియోన్ హాల్లోగల ఓ గదిలో కొరియన్ రూమ్మేట్ జీ మిన్ జిమ్మీ షాతో ఉంటున్నాడు. జిమ్మీ షా సైబర్ సెక్యూరిటీ కోర్సు చదువుతున్నాడు.
ఈ క్రమంలో చద్దా బుధవారం అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. బుధవారం తెల్లవారుజామున 12.45 గంటలకు జిమ్మీ షా 911 నంబర్ ద్వారా పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశాడు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహంపై పదునైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. కాగా, మంగళవారం రాత్రి ఫోన్ చేసినప్పుడు చద్దా అరుపులు, కేకలు వినిపించాయని అతని చిన్ననాటి స్నేహితుడు అరునబ్ సిన్హా తెలిపాడు.
అయితే, మంగళవారం రాత్రి తాను ఫోన్ చేయలేదని, ఫోన్ చేసిన ఇతర మిత్రులు తనకు ఈ విషయం చెప్పారని సిన్హా వివరించాడు. దాంతో పోలీసులు చద్దా రూమ్మేట్ జిమ్మీ షాను అదుపులోకి తీసుకున్నారు.