కుంభకోణాలతో ఉక్కిరిబిక్కిరి అయిన ఇంగ్లండ్ రాజకీయాలకు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా కొంత ఊరటనిచ్చింది. కరోనా సమయంలో నిబంధనలు ఉల్లంఘించి, పార్టీ చేసుకోవడం నుంచి.. తాజాగా సెక్స్ స్కాండల్ వరరకూ ఒకదాని తర్వాత ఒకటిగా పలు కుంభకోణాల్లో బోరిస్ ఇరుక్కున్నారు. ఈ క్రమంలోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.
ఇప్పుడు ఇంగ్లండ్లో సగటు పౌరుని మదిలో మెదులుతున్న ఏకైక ప్రశ్న ఒకటే.. తర్వాతి ప్రధాని ఎవరు? ఈ రేసులో తను కూడా ఉన్నట్లు భారత సంతతికి చెందిన నేత, యూకే మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ ప్రకటించారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి రేసులో తాను కూడా ఉన్నానని, అదే సమయంలో ప్రధాని పదవి కోసం కూడా పోటీ పడుతున్నానని రిషి వెల్లడించారు.
‘‘ప్రస్తుత పరిస్థితిలో ఎవరో ఒకరు ముందడుగు వేసి సరైన నిర్ణయం తీసుకోవాలి’’ అని రిషి అన్నారు. ఆయన ఎవరో కాదు ఇన్ఫోసిస్ సంస్థల వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు. నారాయణమూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షతమూర్తినే 2009లో రిషి పెళ్లి చేసుకున్నారు.
కాగా, రకరకాల స్కాండల్స్లో బోరిస్ పాత్రపై విసుగు చెందిన సొంతపార్టీ నేతలే.. ఆయన తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆయన కేబినెట్లో ఉండటం ఇష్టం లేదంటూ తమ మంత్రి పదవులకు రాజీనామాలు కూడా చేశారు. ఇలా సుమారు 50 మంది రాజీనామాలు చేయడంతో దిగొచ్చిన జాన్సన్.. ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.