Indian Oil | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ).. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో రూ.7.28 లక్షల కోట్లు (96 బిలియన్ డాలర్లు) ఆదాయం సంపాదించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యంత గరిష్ఠంగా ఆదాయం సంపాదించిన భారతీయ కంపెనీగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిలిచింది. ఐఓసీ అనుబంధ సంస్థలతో కలుపుకుంటే సంస్థ మొత్తం ఆదాయం రూ.7.36 లక్షల కోట్లు.
గత ఆర్థిక సంవత్సరంలో ఇంతకుముందు ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.7.92 లక్షల కోట్ల ఆదాయం సంపాదించినట్లు ప్రకటించింది. అయితే, ఇందులో జీఎస్టీ, ప్రభుత్వం తరపున విక్రయించిన ఉత్పత్తుల మొత్తం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఐఓసీ ఆదాయంలో జీఎస్టీ చెల్లింపులు ఉండవని సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ సందీప్ గుప్తా చెప్పారు.
అయితే, మార్చితో ముగిసిన గతేడాది చివరి త్రైమాసికంలో ఐవోసీ నికర లాభాలు 31.4 శాతం తగ్గాయి. 2020-21 మార్చి త్రైమాసికంలో రూ.8,781.30 (షేర్కు రూ.9.56) కోట్ల లాభం గడిస్తే గత మార్చి త్రైమాసికంలో రూ.6,021.88 కోట్లు (షేర్పై రూ.6.56) లాభం గడించింది. 2021 డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో రూ.5,860.80 కోట్ల కంటే ఎక్కువే. 2020-21లో రూ.21,836.04 కోట్ల లాభం గడించిన ఐవోసీ.. గత ఆర్థిక సంవత్సరంలో రూ.24.184.10 కోట్ల నికర లాభం సముపార్జించింది.