మీకు పర్యటనలంటే ఇష్టమా? బీచ్లు, కొండలు, కోటలు, అడవులు తిరిగి తిరిగి బోర్కొట్టిందా? అయితే, ఈసారి జైలుకు వెళ్లండి. ఏ మర్డరో చేసి వెళ్లమని కాదు. మన దేశంలోని జైళ్లను పర్యాటక కేంద్రాలుగా మారుస్తున్నారు. ఆసక్తి ఉంటే మీరూ సందర్శించవచ్చు. కటకటాల్లో కాలక్షేపం చేయవచ్చు.
‘కఠిన కారాగార శిక్ష’ అనగానే గుర్తొచ్చే పేర్లు తీహార్, ఎరవాడ, సెల్యులార్ జైళ్లు. బ్రిటిషర్ల కాలంలో ఆ జైళ్లలో అసువులుబాసిన వీరులెందరో. ఖైదీలను ఎన్ని రకాలుగా హింసించవచ్చో అన్నివిధాలా హింసిస్తారు. బతికున్నప్పుడే చావును పరిచయం చేస్తారు. ఆ కథలూ వ్యథలూ తెలుసుకోవడానికి ఆ జైళ్లను సందర్శించవచ్చు. ఉత్సాహం ఉంటే చిప్పకూడు జీవితాన్నీ చవిచూడవచ్చు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ భారత జైళ్ల శాఖ సిద్ధం చేస్తున్నది. పర్యాటకులు దేశంలోని ప్రధాన జైళ్లను సందర్శించే వీలు కల్పించింది.
ప్రపంచ దేశాల్లో ఇప్పటికే అనేక జైళ్లను పర్యాటక కేంద్రాలుగా మార్చారు. శాన్ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ జైలు చక్కని మ్యూజియంగా మారింది. ఉపయోగంలో లేని ఎన్నో జైళ్లు విలాసవంతమైన హోటళ్లుగా అవతరించాయి. నల్లజాతి సూర్యుడు నెల్సన్ మండేలాను 18 ఏండ్లపాటు ఉంచిన రాబిన్ ద్వీపాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. ఇక్కడ దాదాపు 3 వేల మందికి పైగా రాజకీయ ఖైదీలు కారాగార శిక్ష అనుభించారు. కొందరు కటకటాల్లోనే కన్నుమూశారు. ఇప్పుడా జైలు దక్షిణాఫ్రికాలోనే ప్రఖ్యాత సందర్శనా ప్రాంతం. కెనడా అంటారియోలోని ఓల్డ్ కార్ల్టన్ కౌంటీ జైలులో ఒక బంక్ ఉంది. అందులో కన్నుపొడుచుకున్నా కానరాని చీకటి. ఆ బంక్ను కూడా సందర్శనకు ఉంచారు. పర్యాటకులు నచ్చినంతకాలం అక్కడ ఉండవచ్చు. బొలీవియాలోని శాన్పెడ్రో జైలునూ పర్యాటక ప్రాంతంగా మార్చారు. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోవడానికి థాయిలాండ్ ప్రభుత్వం సగానికి సగం జైళ్లను పర్యాటక ప్రాంతాలుగా మార్చింది.
జైళ్లను సందర్శించే పర్యాటకులు అక్కడ ఖైదీల జీవన విధానాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఖైదీ బాబాయిల వడ్రంగి, కుట్టుపని, సబ్బుల తయారీ, చెప్పుల తయారీ, వ్యవసాయం పనులు చూడవచ్చు. కంప్యూటర్ నైపుణ్యాల గురించి తెలుసుకోవచ్చు. వారు నిర్వహించే హోటళ్లు, బంకులు, కేఫ్లకు వెళ్లొచ్చు. మరింత అనుభూతి కావాలనుకుంటే అక్కడి జైళ్లలో కూర్చొని, చిప్పకూడు కూడా తినొచ్చు. సందర్శకులకు గైడ్గా వ్యవహరించేందుకు నమ్మకస్తులైన స్థానికులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అలాగే జైళ్లలో ఉన్న మూఢనమ్మకాల గురించీ తెలుసుకోవచ్చు. తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు చేసే ఉరికొయ్య చెక్కముక్కను ధరిస్తే మీకు దుష్టశక్తులతో పోరాడే శక్తి వస్తుందని ఓ నమ్మకం ఉంది. జైల్లో వడ్డించే కూడు తింటే.. జాతకరీత్యా జైలుకెళ్లాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చట. జైళ్లను పర్యాటక కేంద్రాలుగా మార్చడం వెనుక ముఖ్య లక్ష్యం.. ప్రజల్లో ఓ సానుకూల మార్పును తీసుకురావడమేనని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ఒకసారి జైలు జీవితాన్ని చూసిన తర్వాత ప్రజల్లో ఏ మూలనో దాగిన నేర ప్రవృత్తిలో మార్పు వస్తుందని ఆశ. ఏ తప్పో చేస్తే తామూ ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందన్న భయమే చాలా మందిని మంచివాళ్లుగా మిగులుస్తుంది.
మనదేశంలో సెల్యులార్, తీహార్, ఎరవాడ జైళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్బ్లెయిర్లో ఉన్న సెల్యులార్ జైలులో స్వతంత్ర సమరయోధులను బ్రిటిష్వారు నిర్బంధించారు, తీవ్రంగా హింసించారు. వారిలో వీర్ సావర్కర్, బీకే దత్, ఫజల్-ఇ-హక్ ఖైరాబాదీ, బరీంద్ర కుమార్ ఘోష్, సుశీల్ దాస్గుప్తా వంటి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు. ఈ కట్టడం దేశ భక్తికి చిహ్నంగా వెలుగొందుతున్నది. ఇక్కడి గోడలు స్వతంత్ర సంగ్రామ గాథలను బోధిస్తాయి. దీన్నిప్పుడు పర్యాటక ప్రాంతంగా మారుస్తున్నారు. అలానే తీహార్జైలు గురించీ ఎన్నో గాథలు వినిపిస్తాయి. హోటల్ మేనేజ్మెంట్లో శిక్షణ పొందిన పలువురు ఖైదీలు ఇక్కడ ఓ కెఫేను నడుపుతున్నారు. ఏటా పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రాంతం పుదుచ్చేరి. పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచేందుకు పుదుచ్చేరి సెంట్రల్ జైలును కూడా పర్యాటక కేంద్రంగా మారుస్తున్నారు. పుణే ఎరవాడ సెంట్రల్ జైలులో మహాత్మా గాంధీ, తిలక్ వంటివారు శిక్ష అనుభవించారు. దీంతోపాటు, గోవాలోని ఫోర్డ్ అగ్వాడా జైలునూ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు.