న్యూఢిల్లీ : రాబోయే ఐదేళ్లలో భారత్ ఆటోమొబైల్ తయారీకి కేంద్రంగా మారుతుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు అన్ని ప్రఖ్యాత ఆటోమొబైల్ బ్రాండ్లు దేశంలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఇథనాల్, బయో-డీజిల్, కాంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG), లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG), ఎలక్ట్రిక్ అండ్ గ్రీన్ హైడ్రోజన్తో కూడిన టెక్నాలజీలపై పని చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా రాబోయే ఐదేళ్లకాలంలో భారత్ ఆటోమొబైల్ తయారీకి కేంద్రంగా మారుతుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
ఈ నెల 13న గుజరాత్లో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త స్క్రాపేజ్ విధానాన్ని ప్రారంభించారు. దీంతో అపరిశుభ్రమైన, కాలుష్యం కలిగించే వాహనాలను నిర్మూలించడంలో సహాయపడుతుందని, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఈ విధానం భారతదేశ మొబిలిటీ, ఆటో రంగానికి కొత్త గుర్తింపును ఇస్తుందన్నారు. ఇథనాల్, హైడ్రోజన్ ఫ్యూయల్, ఎలక్ట్రిక్ మొబిలిటీలో పరిశ్రమలు చురుగ్గా పాల్గొనడం ఎంత ముఖ్యమో.. మన పర్యావరణం, మన భూమి, మన వనరులు, మన ముడిసరుకును కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమన్నారు.