సిల్హెట్: వరుస విజయాలతో జోరు మీదున్న భారత మహిళల జట్టు.. ఆసియా కప్ ఫైనల్లో శనివారం శ్రీలంకతో అమీతుమీకి సిద్ధమైంది. రికార్డు స్థాయిలో వరుసగా ఎనిమిదోసారి ఫైనల్కు చేరిన టీమ్ఇండియా.. ఇదే జోరుతో ట్రోఫీ చేజిక్కించుకోవాలని చూస్తున్నది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏ రకంగా చూసుకున్నా.. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా.. లంక కన్నా మెరుగ్గా కనిపిస్తున్నది. స్మృతి మందన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మతో బ్యాటింగ్ బలంగా ఉండగా.. బౌలింగ్లో రేణుకా సింగ్, దీప్తి, రాజేశ్వరి సత్తాచాటుతున్నారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు జెమీమా రోడ్రిగ్స్ 215 పరుగులతో అగ్రస్థానంలో నిలువగా.. షఫాలీ వర్మ 161 రన్స్ కొట్టింది. ఇక దీప్తి శర్మ బంతితో 13 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాట్తో 94 పరుగులు చేసింది. వీరంతా ఇదే ఊపు కొనసాగిస్తే.. భారత్ విజయం నల్లేరుపై నడకే! లీగ్ దశలో లంకతో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.