BCCI on Srilanka Tour | భారత్లో శ్రీలంక క్రికెట్జట్టు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దీని ప్రకారం రెండు జట్ల మధ్య తొలుత టీ-20 సిరీస్ జరుగనున్నది. తర్వాత టెస్ట్ సిరీస్లో పాల్గొంటాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం తొలుత టెస్ట్ సిరీస్, అటుపై టీ-20 సిరీస్ నిర్వహించాల్సి ఉంది.రెండు జట్లు మూడు టీ-20 మ్యాచ్లు, రెండు టెస్ట్ మ్యాచ్ల్లో తల పడతాయి. ఈ నెల నాలుగోవారంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభం అవుతుంది. నాలుగు చోట్ల మ్యాచ్లు జరుగుతాయి.
బెంగళూరులో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇది పింక్బాల్మ్యాచ్గా నిలుస్తుంది. 2019లో బంగ్లాదేశ్, 2021లో ఇంగ్లండ్కు వ్యతిరేకంగా పింక్ బాల్ టెస్ట్ ఆడిన తర్వాత టీంఇండియా ఆడబోతున్న మూడో పింక్ టెస్ట్ మ్యాచ్ అవుతుంది. బెంగళూరులో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ జరుగనున్నది. సవరించిన షెడ్యూల్ ప్రకారం మూడు టీ-20 మ్యాచ్లు, రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో శ్రీలంక పాల్గొంటుందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
దీని ప్రకారం ఫిబ్రవరి 24న లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియంలో తొలి టీ-20 మ్యాచ్, మిగతా రెండు టీ-20 మ్యాచ్లు 26,27 తేదీల్లో ధర్మశాలలో నిర్వహిస్తారు. ప్రస్తుతం వెస్టిండీస్తో జరుగుతున్న టీ-20 సిరీస్ ముగిసిన వెంటనే శ్రీలంకతో సిరీస్ ప్రారంభం అవుతుంది.
మార్చి 4-8 మధ్య మొహలీలో తొలి టెస్ట్ మ్యాచ్, బెంగళూరులో మార్చి 12-16 మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. మొహలీలో జరిగే టెస్ట్ మ్యాచ్.. మాజీ సారధి విరాట్ కోహ్లీకి 100వ మ్యాచ్. గత నెలలో సఫారీలతో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లోనే కోహ్లీ ఈ రికార్డు నమోదు చేయాల్సి ఉంది. కానీ వెన్నెముక నొప్పితో ఒక టెస్ట్ మ్యాచ్కు దూరమయ్యాడు.
తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 నుంచి మొహాలీలో తొలి టెస్ట్ మ్యాచ్, రెండో టెస్ట్ మ్యాచ్ మార్చి 5 తేదీ నుంచి జరుగాల్సి ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో శ్రీలంక టీ-20 మ్యాచ్లు ఆడుతున్నది. ఈ నేపథ్యంలో షెడ్యూల్లో మార్పులు చేయాలని బీసీసీఐని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) కోరింది.