కొలంబో: ఖచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్లో టీం ఇండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. గురువారం రాత్రి కొలంబోలో ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న మూడవ, చివరి టీ-20 మ్యాచ్లో టీం ఇండియా 20 ఓవర్లలో కేవలం 81 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. శ్రీలంక ముందు 82 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
శ్రీలంక బౌలర్ హసరంగా నాలుగు ఓవర్లలో తొమ్మిది పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లను చేజిక్కించుకున్నాడు. టీం ఇండియా వెన్ను విరిచిన హసరంగ బర్త్ డే గురువారమే కావడం విశేషం.
అంతకుముందు టాస్ గెలుచుకున్న టీం ఇండియా సారధి శిఖార్ ధావన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి ఓవర్ నాలుగో బంతికే ఓపెనర్గా వచ్చిన ధావన్ సింగిల్ పరుగు చేయకుండానే పెవిలియన్కు చేరుకున్నాడు.
శ్రీలంక బౌలర్ దుష్మంత చమీరా తొలి ఓవర్లో వేసిన నాలుగో బంతిని డిసిల్వాకు అందించడంతో ధావన్ కథ ముగిసింది. మరో బ్యాట్స్మన్ శ్యామ్సన్ కూడా ఖాతాను తెరవకుండానే క్రీజ్ను వదిలాడు.
క్రునాల్కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ ఎనిమిది మంది ఐసోలేషన్లో ఉన్నారు. వారిలో సూర్యకుమార్ యాదవ్, ప్రుథ్వీ షా, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, మనీశ్ పాండే, కే గౌతం, ఇషాన్ కిషన్ ఉన్నారు. వీరు శుక్రవారం వరకు ఐసోలేషన్లోనే ఉంటారు.
బుధవారం రెండో టీ-20 మ్యాచ్లో భుజానికి గాయమైన నవ్దీప్ సోనీ స్థానే కేరళ పేస్ బౌలర్ సందీప్ వారియర్తో టీం ఇండియా బరిలోకి దిగింది. మరోవైపు శ్రీలంక కూడా గాయపడిన ఇసురు ఉదాన స్థానంలో పథుం నిస్సాంకను తీసుకున్నది.
తొలి మ్యాచ్లో భారత్, బుధవారం జరిగిన రెండో మ్యాచ్లో శ్రీలంక గెలుపొందాయి. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో గురువారం జరుగుతున్న మ్యాచ్ కీలకం కానున్నది. యూఏఈలో జరిగే టీ-20 వరల్డ్ కప్కు ముందు ఇదే చివరి మ్యాచ్ కావడం గమనార్హం.