మొహాలీ: పొట్టి ప్రపంచకప్నకు ముందు ఏ స్థానంలోనైనా ఆడగలిగే ప్లేయర్లు ఉండటం వల్ల జట్టుకు అధిక ప్రయోజనం చేకూరుతుందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆదివారం మొహాలీ చేరుకున్న టీమ్ఇండియా.. ప్రాక్టీస్ ప్రారంభించింది. గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులో చోటు దక్కించుకున్న జస్ప్రీత్ బుమ్రాతో పాటు ఆటగాళ్లంతా మైదానంలో చెమటోడ్చారు. మంగళవారం ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరుగనుండగా.. రోహిత్ మీడియాతో మాట్లాడాడు.
విరాట్ కోహ్లీని ఓపెనర్గా బరిలో దించాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై హిట్మ్యాన్ వివరణ ఇచ్చాడు. ‘ప్రతి జట్టుకూ బ్యాటింగ్, బౌలింగ్లో మరిన్ని ఆప్షన్లు ఉండటం సానుకూలాంశం. విరాట్ కోహ్లీతో ఇన్నింగ్స్ ప్రారంభించడం మంచి ఎంపికే. ప్రస్తుతం జట్టులో మూడో స్పెషలిస్ట్ ఓపెనర్ లేడు. విరాట్కు ఐపీఎల్లో ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది. ఆసియా కప్ చివరి మ్యాచ్లో అతడు ఓపెనర్గా సెంచరీ సాధించాడు. అయితే వచ్చే ప్రపంచకప్లో మాత్రం కేఎల్ రాహులే ఓపెనింగ్ చేస్తాడు’ అని రోహిత్ అన్నాడు.
షమీ స్థానంలో ఉమేశ్
పేసర్ మహమ్మద్ షమీ కరోనా కారణంగా అందుబాటులో లేకుండా పోవడంతో అతడి స్థానంలో మూడేండ్ల తర్వాత ఉమేశ్ యాదవ్ను టీ20లకు ఎంపిక చేశారు.