న్యూఢిల్లీ : వరుసగా గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రతమత్తమైంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాబోయే కొన్ని నెలలు వ్యాక్సిన్ల ఎగుమతిని విస్తరించదని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. దేశంలో మహమ్మారి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ అవసరాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే వాణిజ్య ఒప్పందాలు, ఎగుమతి కట్టుబాట్లను గౌరవిస్తామని, మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలకు భారత్ సహాయం అందిస్తుందని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు భారత్ 80 దేశాలకు 60.4 మిలియన్ మోతాదుల కొవిడ్ వ్యాక్సిన్లను సరఫరా చేసింది. ఇందులో కొన్ని సాయంగా, మరికొన్ని వాణిజ్య పరంగానూ అందజేసింది. కొవిడ్ టీకా పంపిణీలో సమానత్వం కోసం ఏర్పాటైన కొవాక్స్లో భాగంగానూ దేశం.. టీకాలను ఆయా దేశాలకు ఆయా దేశాలకు పంపించింది. ఆయా దేశాలకు టీకా అందించేందుకు భారత్ కట్టుబడి ఉంటుందని, కానీ దేశీయ డిమాండ్ను నెరవేర్చేందుకు రానున్న కొన్నినెలలు ఎగుమతులను విస్తరించబోమని అధికారులు పేర్కొన్నారు. టీకా ఉత్పత్తి పెంచడం దృష్టి సారించినందున సుమారు రెండు, మూడు నెలల తర్వాత పరిస్థితిని సమీక్షించనున్నట్లు తెలిపారు. జనవరి 20 నుంచి ఇండియా విదేశాలకు టీకా డోసులను పంపిణీ చేస్తోంది. దేశంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జనవరి 16న ప్రారంభమైంది. తొలుత వైద్య సిబ్బందికి టీకా అందించారు. ఆ తర్వాత.. ఫిబ్రవరి 2 నుంచి కరోనా యోధులకు, మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తోంది. వచ్చే నెల ఒకటి నుంచి 45 ఏళ్లు మించిన వారందరికీ వ్యాక్సిన్ సరఫరా చేస్తామని ఇటీవల కేంద్రం ప్రకటించింది. ఇప్పటి వరకు 5.31కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు వేసింది.