కరీంనగర్ : భారతదేశ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి ఇండియా సూపర్ పవర్గా ఎదగాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
సామూహిక గీతాలాపన కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని గీతా భవన్ వద్ద నిర్వహించిన జాతీయ గీతాలాపన కార్యక్రమంలో విద్యార్థులు, నగరవాసులతో కలిసి వారు సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 15 రోజులపాటు ఉత్సవాలను నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారన్నారు. నేటి తరానికి స్వాతంత్య్ర ఉద్యమం గురించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గాంధీజీ చరిత్రను నేటితరానికి తెలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో గాంధీ సినిమాను ప్రదర్శిస్తున్నామని వారు తెలిపారు.
సూపర్ పవర్ అంటే అమెరికా, రష్యా దేశాలు అని, అణ్వస్త్రాలు, జెట్ విమానాలు, బాంబర్స్ ఉంటేనే సూపర్ పవర్ దేశాలు అని మేము చదువుకున్నాం. అయితే రాబోయే 25 సంవత్సరాల వరకు భారతదేశం సూపర్ సాఫ్ట్ పవర్ కావాలని, సూపర్ సాఫ్ట్ పవర్ అంటే విద్య, విజ్ఞానం, వ్యవసాయం, ఇండస్ట్రీస్ అన్నారు.
భారత దేశాన్ని సూపర్ సాఫ్ట్ పవర్ గా తీర్చి దిద్దుకునేందుకు ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవాలన్నారు. 8 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించి యావత్ దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు.
కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ,సుడా చైర్మన్ జీవి రామకృష్ణ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.