న్యూఢిల్లీ: రెండేళ్లలో 47 లక్షల కరోనా మరణాలు భారత్లో నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. 2020 జనవరి నుంచి 2021 డిసెంబర్ వరకు భారత్లో లక్షలాది మంది కరోనా వల్ల చనిపోయినట్లు ఆ సంస్థ నివేదిక పేర్కొంది. కాగా, ఈ కాలంలో దేశంలో సుమారు 5,20,000 కరోనా మరణాలు నమోదైనట్లు అధికార గణాంకాల ప్రకారం తెలుస్తున్నది. అయితే ప్రపంచవ్యాప్త కరోనా మరణాల్లో మూడో వంతు, కేంద్ర ప్రభుత్వ గణాంకాలకు పది రెట్ల మేర ఇది ఉన్నది. అలాగే అధికార లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఆరు లక్షల మంది కరోనా బారినపడి మరణించారు. అయితే ఈ సంఖ్యకు రెట్టింపులో ప్రపంచ వ్యాప్తంగా 15 లక్షల మంది వైరస్ వల్ల చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికలో వెల్లడించింది.
కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ గణిత నమూనా ప్రకారం ఈ లెక్కలు వేశారని ప్రశ్నించింది. ఈ సంఖ్యకు వాస్తవ సంఖ్యకు చాలా తేడా ఉన్నదని తెలిపింది. దేశంలో జనన, మరణాల నమోదుకు అత్యంత బలమైన వ్యవస్థ ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. డబ్ల్యూహెచ్వో డేటా సేకరణ వ్యవస్థను ప్రశ్నించింది. అసంబద్ధంగా ఉన్న ఈ గణాంకాల శాస్త్రీయతపై అనుమానాలు వ్యక్తం చేసింది.