న్యూఢిల్లీ : వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా సమర్థవంతమైన చట్టాన్ని తీసుకువచ్చి.. ఆమోదించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) లేఖ రాసింది. ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై హింసకు వ్యతిరేకంగా దేశంలో సమగ్రమైన ఏకరీతి, సమర్థవంతమైన చట్టం అవసరమని పేర్కొంది. దాడులు గత కొద్ది సంవత్సరాలుగా పెరిగాయని, ఇవి వ్యవస్థకు ముప్పుగా మారాయని తెలిపింది. నిన్న అసోంలోని హోజాయ్ జిల్లాలో కొవిడ్ రోగి మృతి చెందగా.. వైద్య బృందంపై బాధిత కుటుంబీకులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఐఎంఏ స్పందించింది. మహమ్మారి సమయంలో అవిశ్రాంతంగా పని చేస్తున్నప్పటికీ.. ఆరోగ్య సంరక్షణ రంగం హింసతో తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేసింది.