హైదరాబాద్, నవంబర్ 26: వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి ఆర్థికంగా దన్నుగా నిలువడానికి సిద్ధమైంది ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సంస్థలకు 100 మిలియన్ డాలర్ల నిధులు రుణంగా అందించనున్నట్లు ప్రకటించింది. దేశంలో ఏడు సంస్థలకు ఆర్థిక సహాయ సహకారం అందించనుండగా, వీటిలో హైదరాబాద్కు చెందిన రెండు సంస్థలు ఉన్నట్లు ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రమేశ్ తెలిపారు. భారత్తోపాటు ఇతర దేశాల్లో వ్యాక్సిన్లకు డిమాండ్ అధికంగా ఉన్నదని, ముఖ్యంగా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయన్నారు. విదేశాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారత్కు చెందిన ఫార్మా, బయోటెక్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.