న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచ దేశాలకు అవసరమైన యంత్రాలు, పారిశ్రామిక విడి భాగాలన్నీ చైనా నుంచే సరఫరా అవుతాయి.. ప్రత్యేకించి ఫార్మా, మొబైల్స్, ఆటోమొబైల్స్ రంగాల్లో వాడే విడి భాగాలు, ముడి సరుకు డ్రాగన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఎలక్ట్రానిక్ గూడ్స్ కోసం చైనా నుంచి వచ్చే దిగుమతులపైనే భారత్ ఆధారపడి ఉందని అంతా చెబుతారు..
కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంజినీరింగ్ ఉత్పత్తులు భారత్ నుంచి చైనాకు భారీగా పెరిగాయి. 2020-21లో డ్రాగన్కు అవసరమైన ముడి ఇనుము ఎగుమతి చేయడంలో మనదేశం ముందు వరుసలో నిలిచింది.
అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- ఫిబ్రవరి మధ్య కాలంలో ఏకంగా 114 శాతం ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు అభివృద్ధి చెందాయని పరిశ్రమ సంఘం ఇంజినీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఈఈపీసీ) తెలిపింది.
25 ప్రధాన దేశాల మార్కెట్లకు భారత్ ఇంజినీరింగ్ ఎగుమతుల వాటా నాలుగింట మూడొంతులు ఉన్నాయి. ఇప్పటికీ భారతీయ ఎగుమతి దారులు సంప్రదాయ మార్కెట్లపై ఆధారపడుతున్నారని ఈఈపీసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
చైనా, సింగపూర్, జర్మనీ, ధాయిలాండ్, ఇటలీ దేశాల్లో మనదేశ ఇంజినీరింగ్ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో చైనాకు ఎగుమతుల్లో సానుకూల వృద్ధి నమోదైంది.
గతనెలలో చైనాకు చేసిన ఎగుమతులు 68 శాతం పెరిగి 235.58 మిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు చూస్తే, 114 శాతం పెరిగి 4.28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
భారత్ నుంచి చైనాకు ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా వృద్ధి చెందినా.. ఇప్పటికీ అమెరికాకే మనదేశం అత్యధికంగా ఇంజినీరింగ్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నది. కానీ 2020-21లో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు అమెరికాకు ఇంజినీరింగ్ ఎగుమతులు తగ్గాయి.
వివిధ దేశాలకు భారత్ నుంచి అత్యధికంగా ఇంజినీరింగ్ వస్తువులు వెళుతున్నాయని ఈఈపీసీ తెలిపింది. ఆ తర్వాత స్థానంలో శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి. మనదేశానికి వచ్చే విదేశీ మారకంలో ఇవి ప్రధాన వనరుగా నిలిచాయి.