పొట్టి ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో రోహిత్ సేన రెండో పోరుకు రెడీ అయింది. ఇటీవల ఆసియా కప్లో ఫైనల్ చేరకుండానే వెనుదిరగడం.. ఆస్ట్రేలియాతో మొహాలీ పోరులో రెండొందల పైచిలుకు స్కోరును కాపాడుకోలేకపోవడం.. సులువైన క్యాచ్లను నేలపాలు చేయడం.. ఇలా టీమ్ఇండియా అన్ని వైపుల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నది. బుమ్రా, షమీ గైర్హాజరీలో భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుండగా.. ఈ మ్యాచ్లో ‘బూమ్ బూమ్ బుమ్రా’ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. మరోవైపు పరిమిత వనరులతోనే బరిలోకి దిగిన ఆసీస్.. అద్భుత ఆటతీరుతో ఇక్కడే సిరీస్ పట్టేయాలని చూస్తున్నది. బౌలర్ల హవా సాగనున్న నాగ్పూర్ పిచ్పై ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి!
నాగ్పూర్: తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవడంలో విఫలమవుతున్న టీమ్ఇండియా మరో పోరుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా శుక్రవారం రోహిత్ సేన రెండో మ్యాచ్ ఆడనుంది. వచ్చే నెలలో ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో కంగారూలతో సిరీస్ను రిహార్సల్గా వినియోగించుకొని లోపాలు సరిదిద్దుకోవాలనుకున్న భారత్కు.. మరిన్ని కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. మిడిలార్డర్ నిలకడలేమి, పసలేని బౌలింగ్, ఫీల్డింగ్ లోపాలు ఇలా అధిగమించాల్సిన అవరోధాలు చాలా కనిపిస్తున్నాయి. మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో బ్యాటర్లు రాణించి రెండొందల పైచిలుకు పరుగులు చేసినా.. బౌలర్లు పూర్తిగా నిరాశ పరిచారు. భారీ స్కోరును కాపాడుకోవడంలో విఫలమయ్యారు.
ఈ నేపథ్యంలో సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే మేనేజ్మెంట్ గంపెడాశలు పెట్టుకుంది. ఒక్క ఆటగాడితో మ్యాచ్ గమనం మారుతుందనుకోవడం అత్యాశే అయినా.. అతడి రాకతోనైనా బౌలింగ్ గాడిన పడితే అదే పదివేలు. మ్యాచ్కు ముందు రోజు సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. బుమ్రా ఫిట్గానే ఉన్నాడని చెప్పడం భారత అభిమానులు ఆనందించే విషయం. ప్రధాన ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టార్క్, స్టొయినిస్, మిషెల్ మార్ష్ అందుబాటులో లేకున్నా.. మైదానంలో వీర విజృంభణ కొనసాగిస్తున్న ఆసీస్.. ప్రస్తుతం మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజలో ఉంది. ఇక సిరీస్ పోటీలో నిలువాలంటే రోహిత్సేన ఈ మ్యాచ్లో తప్పక గెలువాల్సిందే! నాగ్పూర్లో విజృంభించి ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టీమ్ఇండియా కప్పు చేజిక్కించుకోవాలని ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు.
ముంచినా తేల్చినా వాళ్లే..
బౌలర్ల వైఫల్యం కారణంగానే రోహిత్సేన ఇటీవల ముగిసిన ఆసియాకప్లో ఫైనల్ చేరుకుండానే వెనుదిరగగా.. బుమ్రా గైర్హాజరీలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేసిన అనుభవం ఉన్న భువీ.. ఆఖర్లో కొత్త కుర్రాడిలా భారీగా పరుగులు సమర్పించుకోవడం మేనేజ్మెంట్ను కలవరపెడుతున్నది. ఇంగ్లండ్ పర్యటన అనంతరం గాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా.. ఆసియాకప్లో పాల్గొనలేదు. ప్రస్తుతం ఫిట్నెస్ సంతరించుకున్న అతడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది ఆసక్తికరం. మరోవైపు చాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన హర్షల్ పటేల్ కూడా గత మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
టీ20 వరల్డ్కప్నకు ముందు టీమ్ఇండియా ఈ ఫార్మాట్లో మరో ఐదు మ్యాచ్లు మాత్రమే ఆడనున్న నేపథ్యంలో మేనేజ్మెంట్ ఎలాంటి వ్యూహాలు పన్నుతుందో చూడాలి. హార్దిక్ పాండ్యా బంతితో నిలకడ కనబర్చాల్సి ఉండగా.. యుజ్వేంద్ర చాహల్ మరింత ప్రభావం చూపాల్సిందే. బ్యాట్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ ఇదే తరహా ప్రదర్శన ఆశిస్తున్నది. గత కొంతకాలంగా వికెట్ విలువ గుర్తెరిగి ఆడుతున్న పాండ్యా.. మరోసారి మిడిలార్డర్లో కీలకం కానున్నాడు. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న అక్షర్ పటేల్ బంతితో ఆకట్టుకున్నా.. బ్యాట్తో రాణించాల్సి ఉంది. గత మ్యాచ్లో విఫలమైన రోహిత్, కోహ్లీ, దినేశ్ కార్తీక్ సత్తాచాటితే బ్యాటింగ్లో భారత్కు తిరుగుండదు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, హార్దిక్, కార్తీక్, అక్షర్, హర్షల్, భువనేశ్వర్, బుమ్రా/ఉమేశ్, చాహల్/అశ్విన్.
ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), గ్రీన్, స్మిత్, మ్యాక్స్వెల్, ఇంగ్లిస్, డావిడ్, వేడ్, కమిన్స్, ఎలీస్, జంపా, హజిల్వుడ్.
జట్టు సభ్యులంతా పూర్తి ఫిట్గా ఉన్నారు. బుమ్రా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే తుది నిర్ణయం ఫిజియోదే. పిచ్ను అంచనా వేయడం ముఖ్యం. ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికైనా సిద్ధంగా ఉంటా. నెట్స్లో భువనేశ్వర్, హర్షల్ పటేల్ చాలా కష్టపడుతున్నారు.
-సూర్యకుమార్ యాదవ్
పిచ్, వాతావరణం
గత మ్యాచ్ జరిగిన మొహాలీ పిచ్తో పోల్చుకుంటే.. నాగ్పూర్ వికెట్ పూర్తి భిన్నంగా ఉండనుంది. పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభించనుంది. టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశాలెక్కువ. ఇక్కడ జరిగిన గత 12 టీ20ల్లో తొలి ఇన్నింగ్స్ సగటు 151. వర్షం కారణంగా గురువారం జరుగాల్సిన టీమ్ఇండియా ప్రాక్టీస్ రైద్దెంది. శుక్రవారం ఆకాశం మేఘావృతమై ఉండనుంది.