పొట్టి క్రికెట్ అంటేనే వీరబాదుడుకు మారుపేరు కాగా.. మైదానం
చిత్తడిగా మారడంతో 8 ఓవర్లకు కుదించిన పోరులో బౌండ్రీల మోత మోగింది. 18 ఫోర్లు, 10 సిక్సర్లు నమోదైన మ్యాచ్లో రోహిత్సేనదే పైచేయి అయింది. టాస్ గెలువడంతోనే టీమ్ఇండియా సగం మ్యాచ్ గెలిచేయగా.. మిగిలినపని హిట్మ్యాన్ రోహిత్ శర్మ పూర్తి చేశాడు. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్ను సమం చేసిన భారత్.. ఆదివారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో కప్పు కోసం ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది!
నాగ్పూర్: గత మ్యాచ్లో బ్యాటర్లు రాణించినా.. బౌలర్ల వైఫల్యంతో పరాజయం పాలైన టీమ్ఇండియా.. రెండో పోరులో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఔట్ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో పలుమార్లు పరిశీలించిన అంపైర్లు రెండున్నర గంటల ఆసల్యంగా మ్యాచ్ ప్రారంభించారు. జరుగుతుందో లేదో అనే అనుమానాల మధ్య శుక్రవారం సాగిన పోరులో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆసీస్ నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, ఒక సిక్సర్) ఆరంభంలో ధాటిగా ఆడగా.. మాథ్యూ వేడ్ (20 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆఖర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టగా.. గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చిన ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (1/23) తన యార్కర్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 7.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. సారథి రోహిత్ శర్మ (20 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చివరి వరకు నిలువగా.. కేఎల్ రాహుల్ (10; ఒక సిక్సర్), విరాట్ కోహ్లీ (11; 2 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (2 బంతుల్లో 10 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్సర్) తలా కొన్ని పరుగులు చేశారు. రోహిత్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: 8 ఓవర్లలో 90/5 (వేడ్ 43 నాటౌట్, ఫించ్ 31; అక్షర్ 2/13, బుమ్రా 1/23),
భారత్: 7.2 ఓవర్లలో 92/4 (రోహిత్ 46 నాటౌట్; జంపా 3/16).