దేశభక్తి ఉట్టిపడింది.. జాతీయభావం తొణికిసలాడింది. మది నిండా మువ్వన్నెల జెండా మురిసింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జాతీయ జెండాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఖమ్మం నగరంలోని జడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జెండా ఊపి జాతీయ జెండా ప్రదర్శనను ప్రారంభించారు. విద్యార్థులు, యువతీ యువకులు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సుమారు రెండు కిలోమీటర్ల పొడవు ఉన్న జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. 10 వేల మందితో జడ్పీ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెంలో 250 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ల ఆధ్వర్యంలో జాతీయజెండాల ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భద్రాచలంలో ఆలయ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ భావాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ వజ్రోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు.
ఖమ్మం, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్వతంత్ర భారత వజ్రోత్సవాలు శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఖమ్మం నగరంలో 10 వేల మందితో 2 కిలోమీటర్ల జాతీయ జెండా ప్రదర్శన జరిగింది. జడ్పీ సెంటర్లో ప్రదర్శనను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రదర్శనలో విద్యార్థులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ జాతీయ పతాక విశిష్టతను తెలుసుకోవాలన్నారు. ప్రదర్శనలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, సీపీ విష్ణు ఎస్ వారియర్, మేయర్ పునుకొల్లు నీరజ పాల్గొన్నారు. కొత్తగూడెంలోని రైల్వేస్టేషన్ నుంచి ప్రకాశం స్టేడియం వరకు 250 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన జరిగింది. ప్రదర్శనను మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించారు.
ప్రకాశం స్టేడియంలో ఆయన మూడు రంగుల బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. ప్రజలకు స్వాతంత్య్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 16న జరిగే సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రదర్శనలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డాక్టర్ వినీత్, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సత్తుపల్లి, కల్లూరులో వందల అడుగుల జాతీయ జెండాలను విద్యార్థులు ప్రదర్శించారు. ప్రదర్శనలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమామహేశ్వరరావు, కల్లూరు ఏసీపీ వెంకటేశ్, ఆత్మ చైర్మన్ హరికృష్ణారెడ్డి పాల్గొన్నారు. మణుగూరులో జరిగిన ఫ్రీడం రన్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నగారా వాయించారు. భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఉద్యోగులు జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. కూసుమంచి ర్యాలీలో డీసీపీ సుభాశ్చంద్రబోస్ పాల్గొన్నారు. మధిరలో జరిగిన ప్రదర్శనలో జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు పాల్గొన్నారు.