భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల్లో భాగంగా సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన సంబురాలు అంబరాన్నంటాలయి. వీధివీధినా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. అన్ని చోట్లా పలువురు ప్రముఖులు జాతీయ జెండాని ఎగురవేసి వందనం సమర్పించారు.
అమరవీరుల చిత్రపటాల వద్ద పుష్పాలు ఉంచి వారి త్యాగాలను స్మరించారు. ఖమ్మం పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కొత్తగూడెం జిల్లా పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, సింగరేణి ప్రధాన కార్యాలయంలో సత్యనారాయణ, చంద్రశేఖర్, బలరాం, ఐటీడీఏలో పీవో గౌతమ్ పోట్రు తదితరులు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అన్ని చోట్లా నిర్వహించిన వేడుకల్లో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఖమ్మంలో వివిధ శాఖలు చేపట్టిన శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రెండు జిల్లాల్లోనూ ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.